సీఎంల భేటీపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు సీఎంలుగా వ్యవహరించిన వారిలో ఒకరు ప్యాలెస్కు, మరొకరు ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కనిపించకుండా నియంతలను తలపించారన్నారు. ప్రస్తుత సీఎంలు ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా నేడు ప్రజా భవన్లో చర్చలు జరపబోతున్నారని సోమిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఇక మంచిరోజులు... తెలుగు జాతికి నిండు వెలుగులు రావడం ఖాయమని సోమిరెడ్డి పేర్కొన్నారు.