గత ఐదేళ్లలో జగన్ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం జరిగిందని, అమరావతి, పోలవరం విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ జగన్ వస్తారేమోనని కొందరు భయపడుతున్నారని.. ముఖ్యంగా ఆ భూతాన్ని చూసి రాష్ట్రానికి వచ్చేందుకు పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని తెలిపారు. అయితే దానిని ఎలా నియంత్రించాలో తమకు తెలుసని.. దాని గురించి భయపడాల్సిన అవసరం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం ఢిలీల్లో కేంద్ర ఆర్థిక, రక్షణ, ఆరోగ్య మంత్రులతో భేటీల అనంతరం.. హైదరాబాద్ బయల్దేరి వెళ్లే ముందు మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ, ప్రాంతీయ మీడియాతో మాట్లాడుతూ..... ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ప్రధాన ఎజెండాగా తన రెండ్రోజుల పర్యటన సాగిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడంతో పాటు మొత్తం రాష్టాన్ని పునర్నిర్మించడమే ధ్యేయంగా ఢిల్లీలో ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులతో చర్చలు జరిపానని, అందరి నుంచీ సానుకూల స్పందన వ్యక్తమైందని చెప్పారు. గత ఐదేళ్లుగా జరిగిన నష్టం నుంచి బయటకు రావాలని, అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకారం అందించాలని కేంద్రాన్ని కోరామని చెప్పా రు. ఏపీ గ్లోబల్ లీడర్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.