మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడి కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శలు చేయడంతో ఆగ్రహించిన వైసీపీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. టీడీపీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు, ఆఫీస్ ఆవరణలోని కార్లు ధ్వంసం చేశారు. అటు టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఇంట్లోని విలువైన వస్తువులు, ఫర్నిచర్ ధ్వంసం చేసి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో పోలీసులు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.