ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు విషయంలో వ్యూహాత్మక తప్పిదాలు అన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని, 2013-14 రేట్లతో 2016లో ప్రాజెక్టును టేకోవర్ చేసి తప్పు చేశారన్నారు. అన్ని అనుమతులూ తీసుకొచ్చి దివంగత వైయస్ఆర్ పోలవరానికి ప్రాణం పోశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం పేరుతో పోలవరం గురించి ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని అంబటి అన్నారు. చంద్రబాబు ఇచ్చిన శ్వేతపత్రంలో వాస్తవాలు లేవని, అన్నీ తప్పులు చెబుతున్నామన్న భయం లోపల ఉందన్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారంటే దానికి సమాధానం లేదన్నారు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు ఇకపై వెళ్లబోనని ఇవాళ చెప్పాడన్నారు. అదేమంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డి విధ్వంసం అంటున్నారని, కాంట్రాక్టర్లను మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయిందంటున్నారన్నారు. మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతారనే భయం, ఆయనకు 40 శాతం ఓట్ల శాతం ఉందనే భయం, మీరు ముగ్గురు కలిసినా కేవలం 56 శాతం మాత్రమే వచ్చాయని మీకు తెలుసని, మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంతై, అంతై వటుడింతై అన్నట్టుగా రాబోయే కాలంలో ఎదిగిపోతాడు కాబట్టి, చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేడు కాబట్టి ఇలా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు.