రేపు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కల్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు.. ఆ వాహనానికి తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు. కూటమి పొత్తులను పవన్ కల్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. ఇవాళ మధ్యాహ్నం పవన్ సెక్యూరిటీ అధికారులు కొండగట్టుకు రానున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంలో కొండగట్టుకు పవన్ చేరుకున్నారు. జేఎన్టీయూలో హెలీప్యాడ్ అందుబాటులో లేదు. పవన్ సెక్యూరిటీ స్పెషల్ అడ్వైజర్ కల్నల్ అర్జున్ రూట్ మ్యాప్, పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కు భారీ స్వాగత ఏర్పాట్లు నిర్వహించనున్నారు.