ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను, ప్రతిష్టను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా విమర్శించారు. వైస్ ఛాన్సలర్గా కరుడుగట్టిన వైసీపీవాది ప్రసాదరెడ్డిని నియమించి ఈ గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్టను అమాంతం దిగజార్చారని విమర్శించారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించి యూనివర్సిటీని ఒక రాజకీయపార్టీ కార్యాలయంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. దేవాలయం లాంటి ఈ పవిత్రమైన విద్యాసంస్థను వైసీపీ ప్రభుత్వం ఒక ఫక్తు రాజకీయ కేంద్రంగా మార్చేశారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.