ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరీ జగన్నాథ ఆలయంలో అరుదైన ఘట్టం.. 53 ఏళ్ల తర్వాత ఒకే రోజున మూడు ఉత్సవాలు

national |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 10:31 PM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి అలయంలో ఒకే రోజున మూడు ఉత్సవాలు జరగనున్నాయి. మూడు ఉత్సవాలు ఇలా ఒకే రోజున జరగడం 53 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. చివరిసారిగా 1971లో ఒకరోజు జగన్నాథస్వామి నవయవ్వన రూపం, నేత్రోత్సవం, రథయాత్ర జరిగింది. మళ్లీ ఆ నాటి పరిస్థితి పునరావృతమవుతోంది. ఈ నేపథ్యంలో నెల రోజులుగా మల్లగుల్లాలు పడుతోన్న అధికార యంత్రాంగం.. చివరకు సోమవారం ఛత్తీసా నియోగ్‌ (36 తెగలు) ప్రతినిధులతో సమావేశమై చర్చించింది. 1971లో వేడుకలు నిర్వహించినట్టే అన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.


సాధారణంగా రథయాత్ర సమయంలో జగన్నాథునికి నవయవ్వన అవతారం, నేత్రోత్సవం, గోప్యసేవలు నిర్వహిస్తారు. ఈ మూడు వేడుకలు వేర్వేరు రోజుల్లో జరుగుతాయి. కానీ, ఈసారి ఇవన్నే ఒకే రోజులో జరగనుండటం ప్రత్యేకత. జులై 7న ఘోషయాత్ర చేపట్టనుండగా.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తుల)కు సేవలు మొదలవుతాయి. తెల్లవారుజాము 4.30 గంటల నుంచి పురుషోత్తముని నవయవ్వన అవతారం అలంకరణ, తర్వాత రత్నసింహాసనంపై ఉదయం 7.30 గంటలకు నేత్రోత్సవం జరిపిన అనంతరం గోప్య సేవలు చేపడతారు. అదే రోజు ఉదయం 11 గంటలకు రథాల ప్రతిష్ఠ చేస్తారు.


కాగా, ఈసారి జగన్నాథుని మెడలోని పుష్ఫ మాలకు బదులుగా ఆలయంలో పూజలందుకున్న పొట్టిదియో నుంచి పుష్పమాలలు తెచ్చి రథాలకు అలంకరిస్తారు. ఉత్సవంలో చతుర్థామూర్తులకు తొలుత పొహండి నిర్వహించి, తర్వాత రథాలపై ఇతర సేవలు జరుపుతారు. సాయంత్రం 4 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ చెరాపహరా (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రథాలకు సారథులు, అశ్వాలను అమర్చుతారు. ఈ మూడు రథాలు గుండిచా మందిరంవైపు ప్రయాణిస్తాయి.


సాధారణంగా రథయాత్ర రోజున మూడు రథాలు గుండిచాదేవి ఆలయం వద్దకు చేరుకుంటాయి. కానీ, ఈసారి ఆ పరిస్థితి లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సాయంత్రం 5 గంటలకు రథాలు లాగడం ప్రారంభిస్తారు. తొలుత బలభద్రుడు, తర్వాత సుభద్ర, చివరిగా పురుషోత్తముడు బయలు దేరుతారు. రాత్రివేళలో రథాలు లాగకూడదన్న నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో బలభద్రుని రథం బయలు దేరిన కొంతసేపటికి చీకటి పడుతుంది. రథాలు గుండిచా సన్నిధికి చేరుకునే అవకాశం లేదు. కాబట్టి మర్నాడు (జులై 8) రథాలు మళ్లీ బయలుదేరి... తల్లి సన్నిధికి చేరుకుంటాయి. అయితే, ఆ రోజు గుండిచా పొహండి చేపట్టకూడదు. మళ్లీ 9న ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే, ఇది ఛత్తీసా నియోగ్‌ సేవాయత్‌లకు, శ్రీక్షేత్ర యంత్రాంగానికి సవాల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com