ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్య పెళ్లికూతురికి హెచ్‌ఐవీ పాజిటివ్.. లబోదిబోమంటోన్న రెండు రాష్ట్రాల్లోని యువకులు

national |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 10:24 PM

పెళ్లిపేరుతో యువకులను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్లికూతుర్ని ఉత్తర్ ప్రదేశ్‌ పోలీసులు గత నెల 6న అరెస్ట్ చేశారు. పెళ్లిళ్లు చేసుకుని నగదు, విలువైన వస్తువులతో ఉడాయించే ఆమె వెనుక పెద్ద ముఠాయే ఉంది. మహిళ, మరో ఆరుగురు సభ్యుల ముఠాను ఉత్తరాఖండ్‌‌లో అరెస్ట్ చేసి, ముజఫర్‌నగర్ జైలుకు తరలించారు. ఏడాది కాలంగా ఆ యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. హెచ్‌ఐవీ పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె చేతిలో మోసపోయిన యువకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.


ముజఫర్‌నగర్ జైలు సూపరింటిండెంట్ సీతారాం శర్మ మాట్లాడుతూ.. ‘నిందితురాలైన యువతి ప్రస్తుతం యాంటీవైరల్ థెరపీ తీసుకుంటోంది జైలుకు వచ్చిన తర్వాత ఆమెకు జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ పాజిటివ్ నిర్దారణ అయ్యింది.. ’’ అని చెప్పారు. ఈ ప్రకటనతో రెండు రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారుల అప్రమత్తమయ్యారు. ఆమె చేతిలో నయవంచనకు గురైన యువకులు కోసం ముమ్మరంగా వేటాడుతున్నారు. నిందితురాలిని పెళ్లిచేసుకుని, శారీరకంగా కలిసిన ముగ్గురు యువకులకు హెచ్‌ఐవీ పాజిటివ్ నిర్దారణ అయినట్టు ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.


ఉధమ్ సింగ్ నగర్ ఆరోగ్య విభాగం.. ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆ యువకులకు పరీక్షలు నిర్వహించి, ఏఆర్టీ సెంటర్‌లో చికిత్సను ప్రారంభించింది. బాధిత వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు కొనసాగుతుండగా.. వారిలో ముగ్గురుకి ఇప్పటికే హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది.


పోలీసుల కథనం ప్రకారం.. 20 ఏళ్ల వయసున్న ఆ మహిళ.. పెళ్లిపేరుతో యువకులను మోసం చేస్తోన్న ముఠాలో సభ్యురాలు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ గ్యాంగు సభ్యులు వధువు బంధువులుగా నటిస్తారు. ఉత్తర్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలువురు ఈ ముఠా వలలో చిక్కుకున్నారు. పలు కేసులు నమోదుకావడంతో యువతి, ఆమె తల్లితో సహా ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేసి ముజఫర్‌నగర్‌లోని జైలుకు పంపారు. ఉత్తరాఖండ్‌లో మూడు సహా తాను ఇప్పటి వరకూ ఐదు పెళ్లిళ్లు చేసుకున్నట్టు విచారణ సమయంలో ఆమె వెల్లడించింది. కానీ, పోలీసులు మాత్రం ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. యూపీలోని ముజఫర్‌నగర్ సహా ఇతర ప్రాంతాల్లో బాధితులను గుర్తించే పనిలో ఉన్నారు. నిందితురాల్ని ఉత్తరాఖండ్‌లోని యూఎస్ నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ముఠాకు సహకరించిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అలాగే, బాధితులకు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com