ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా రిపోర్టర్‌పైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 09:57 PM

సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నేరాలకు సంబంధించిన వార్తలను ప్రజలకు తెలియజేయడమే మీడియా ప్రధాన కర్తవ్యం. ఇలాంటి వార్తలు కవర్ చేసే క్రమంలో రిపోర్టర్లు, కెమెరామెన్లు ఎంతో రిస్క్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదికి కూడా వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇలా న్యూస్ కవర్ చేసే క్రమంలో ఎన్నో అడ్డంకులు, బెదిరింపులు వచ్చినా వాటిని లెక్కచేయకుండా మీడియా ప్రతినిధులు తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారిక నివాసాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేస్తుండగా.. వాటిని వీడియో తీయడానికి వెళ్లిన ఓ మహిళా రిపోర్టర్, కెమెరా‌మెన్‌లపైకి.. మాజీ మంత్రి పెంపుడు కుక్కలను వదిలిన సంఘటన ప్రస్తుతం పెను దుమారానికి కారణం అయింది. ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.


మాజీ ఎమ్మెల్యే, బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన నేత ప్రణబ్ ప్రకాష్ దాస్‌కు భువనేశ్వర్‌లో గతంలో కేటాయించిన అధికారిక నివాసంలో అక్రమ కట్టడాలు నిర్మించారు. ఇటీవల జరిగన ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలు కావడం, ఎమ్మెల్యేగా కూడా ప్రణబ్ ప్రకాష్ దాస్ ఓటమి చెందడంతో ఆ అధికారిక నివాసం ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఆ నివాసంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన స్థానిక ఒడియా మీడియాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్, కెమెరామెన్‌తో సహా అక్కడికి చేరుకున్నారు. అయితే పక్కనే ఉన్న మాజీ మంత్రి రఘునందన్ దాస్ ఇంట్లో నుంచి రహస్యంగా వీడియోలు తీయడం ప్రారంభించారు.


అది చూసిన ఒడిశా మాజీ మంత్రి రఘునందన్ దాస్.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న రెండు పెంపుడు కుక్కలను వారిపైకి వదిలిపెట్టాడు. దీంతో ఆ మహిళా జర్నలిస్టుతో పాటు కెమెరామెన్‌కు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రఘునందన్ దాస్‌పై వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రఘునందన్ దాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


2019 లో బీజేడీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రణబ్ ప్రకాష్ దాస్‌ అలియాస్ బాబీ దాస్‌కు భువనేశ్వర్‌లో అధికారిక క్వార్టర్స్‌ను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ బిల్డింగ్‌తో పాటు పక్కనే ఉన్న మరో మూడు భవనాలను కూడా ఆక్రమించుకున్న బాబీ దాస్.. వాటన్నింటినీ కలిపేశారు. అంతటితో ఆగకుండా అక్కడే మరో 4 అంతస్తుల్లో ఇంకో బిల్డింగ్ నిర్మించారు. ఇటీవలి ఎన్నికల్లో బాబీ దాస్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో అధికారిక భవనం ఖాళీ చేయాలని కొత్త ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీంతో ఎవరికీ తెలియకుండా తాను నిర్మించిన బిల్డింగ్‌ను కూల్చివేస్తుండగా.. అది కవర్ చేయడానికి వెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com