ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పఠాన్‌కోట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు.. హైఅలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ

national |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 09:56 PM

దేశంలో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. ఇటీవల కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు ఆ పక్కనే ఉన్న పంజాబ్‌లోకి ప్రవేశించినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కీలకమైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దుల్లో ఉన్న పఠాన్‌కోఠ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో తిరుగుతున్నట్లు సెక్యూరిటీ ఫోర్స్ పసిగట్టింది. అయితే భారత వైమానిక దళానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఎయిర్‌బేస్ ఉన్న పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు సంచరించడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. పఠాన్‌కోట్‌లో హై అలర్ట్ విధించి.. గాలింపు చేపట్టాయి.


మంగళవారం రాత్రి పఠాన్‌కోట్‌ జిల్లాలోని కోట్‌ భట్టియాన్ గ్రామంలో ఇద్దరు ముష్కరులు.. భారీగా ఆయుధాలను కలిగి ఉండి.. వెళ్తున్నట్లు గుర్తించామని బోర్డర్ రేంజ్ డీఐజీ రాకేష్ కుశాల్ తెలిపారు. ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలను గుర్తించి.. ఆ ప్రాంతం మొత్తం భద్రతా బలగాలతో రౌండప్ చేసినట్లు వెల్లడించారు. పలు గ్రామాల్లో సెక్యూరిటీ ఏజెన్సీలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.


ఇద్దరు ఉగ్రవాదులు ఆయుధాలతో కోట్‌ భట్టియాన్‌ గ్రామ పరిసరాల్లో తిరుగుతున్నట్లు గుర్తించామని.. పఠాన్‌కోట్‌ ఎస్‌ఎస్‌పీ సుహైల్‌ ఖాసీం మిర్‌ వెల్లడించారు. ఈ కోట్ భట్టియాన్ గ్రామం.. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాతో సరిహద్దులను కలిగి ఉందని పేర్కొన్నారు. అయితే ఆ ఇద్దరు ఉగ్రవాదులే జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని కోట్‌ పన్నూలో కూడా సంచరించినట్లు తెలిసిందని పఠాన్‌కోఠ్ ఎస్ఎస్‌పీ తెలిపారు. ఈ నెల 12 వ తేదీన పాక్‌ నుంచి కథువా జిల్లా సుక్‌పాల్‌ గ్రామంలోకి చొరబడిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి.


ఇక గతంలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఇద్దరు ఉగ్రవాదులు ఆయుధాలతో సంచరించడం తీవ్ర సంచలనంగా మారింది. 2016 జనవరిలో పఠాన్‌కోట్‌లోని వాయుసేన స్థావరంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మొదట స్థానిక వీధుల్లో తిరుగుతూ వాహనాలను హైజాక్‌ చేసి చివరికి ఎయిర్‌ బేస్‌లోకి ప్రవేశించారు. అనంతరం తెల్లవారుజామున ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది క్వార్టర్స్‌లోకి చొరబడి దాడి చేయగా.. పలువురు వైమానిక దళానికి చెందిన సిబ్బంది అమరులు అయ్యారు. అయితే ఎయిర్‌ బేస్‌లోకి ఉగ్రవాదులు చొరబడినప్పటికీ.. ఎలాంటిటి ఆయుధ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com