ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి మాజీ మంత్రి విడదల రజినీ గుడ్ బై?.. ఆ పార్టీలోకి వెళతారంటూ, క్లారిటీ ఇదేనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 07:57 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది.. ఆ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యింది. ఈ ఘోరమైన ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ వరుసగా సమీక్షలు చేస్తోంది.. అయితే ఆ పార్టీకి ఇప్పుడు వరుసగా తలనొప్పులు వెంటాడుతున్నాయి. కొందరు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శిద్దా రాఘరావులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


విడదల రజిని పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. జాతీయ పార్టీ నేతలతో ఆమె చర్చ జరిపినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె ఫోన్‌లో కూడా టచ్‌లో లేరని చెబుతున్నారు.. అధిష్టాన పెద్దలకు అందుబాటులో లేరని చెబుతున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే అంటున్నాయి వైఎస్సార్‌సీపీ వర్గాలు.. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారంటున్నారు.


మాజీ మంత్రి విడదల రజిని ఎన్నికల్లో ఓటమి తర్వాత అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డిని కూడా కలిశారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం వైఎస్ జగన్‌తో దిగిన ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నారు. అంతేకాదు సోమవారం రోజు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ కూడా షేర్ చేశారు. కాబట్టి ఆమె పార్టీ మారడం లేదని కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విడదల రజిని స్పందించాల్సి ఉంది.


విడదల రజిని తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. రజినికి అనూహ్యంగా చిలకలూరిపేట టికెట్ దక్కగా.. ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమెకు ఏకంగా మంత్రి పదవి దక్కింది. అది కూడా కీలకమైన వైద్యఆరోగ్యశాఖ బాధ్యతలు దక్కాయి. అయితే 2024 ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీ అధిష్టానం విడదల రజినికి చిలకలూరి పేట టికెట్ నిరాకరించింది. ఆమె స్థానంలో మల్లెల రాజేష్‌కు అవకాశం ఇచ్చారు.. మళ్లీ ఆయన్ను కూడా మార్చి కావటి శివమనోహర్ నాయుడికి చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. రజినిని సిట్టింగ్ స్థానమైన చిలకలూరి పేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. అక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి.. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో 51వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు చిలకలూరి పేటలో కూడా మనోహర్ నాయుడు ఓటమిపాలయ్యారు. అయితే తాజాగా విడదల రజిని పార్టీ మారుతున్నట్లు ప్రచారం మొదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com