ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరి మధ్య వాగ్వాదం, దాడిలో ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 05:38 PM

లారీ డ్రైవర్‌ దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్‌ మృత్యువాతపడ్డారు. దీనిపై రోలుగుంట ఎస్‌ఐ సురేష్‌ అందించిన వివరాలివి.. కొమరవోలు గ్రామానికి చెందిన కసిపల్లి రాంబాబు (58) ఈ నెల 15న మధ్యాహ్నం నర్సీపట్నం నుంచి రోలుగుంటకు ఆటోను నడుపుకుంటూ వస్తున్నాడు. ఇదే సమయంలో కె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్‌ గుములూరు రమణబాబు లారీతో వస్తూ రోలుగుంట హిమనీ స్టోన్‌ క్రషర్‌ సమీపంలో ఓవర్‌ టెక్‌ చేసే ప్రయత్నంలో ఆటోను రాసుకుంటూ క్రషర్‌లోకి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఆటో అద్దం ధ్వంసం కావడంతో డ్రైవర్‌ రాంబాబు లారీ డ్రైవర్‌ రమణబాబును ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో లారీ క్యాబిన్‌లో ఉన్న ఇనుప రాడ్డుతో రమణబాబు దాడి చేయడంతో రాంబాబుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే రమణబాబు పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న రాంబాబు స్థానికులు చూసి ఆయనబంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు అతనిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్సకు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం రాంబాబు మృతిచెందాడు. మృతుని భార్య మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. సోమవారం ఉదయం అనకాపల్లి డీఎస్పీ ఎస్‌.అప్పలరాజు, సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారైన నిందితుడిని అరెస్టు చేస్తామని తెలిపారు. అలాగే, దళిత సంఘాల నాయకులు గారా ఈశ్వరరావు, కిడారి మల్లేశ్వరరావులు డీఎస్పీని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com