ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోజు గొంతు ఎండిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి.. ప్రశాంత్ కిశోర్ సంచలన పోస్ట్

national |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 09:59 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300లకు పైగా స్థానాల్లో విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిశోర్  ఇటీవల అంచనా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై ఆయన ఎక్స్‌ (ట్విట్టర్)‌లో పెట్టిన పోస్టులో.. తన అంచనాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, అలాగే నిరాశలో కూరుకుపోయిన వారికి ఆయన ఒక సలహా ఇచ్చారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడిన రోజున మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి అని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.


ప్రశాంత్‌ కిశోర్‌‌ను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్.. ఇటీవల పలు ఎన్నికల్లో ఆయన అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు, 2022 హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, గతేడాది తెలంగాణ ఎన్నికల్లో మీ అంచనాలు తల్లకిందులయ్యాయి కదా.. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పారు కదా? అని థాపర్ ప్రశ్నించగా.. నేను అలా అనలేదని, అన్నట్టు ఆధారం చూపిచాలని కోరారు. దీంతో ఆయన మాట్లాడిన వీడియోలను కరణ్ థాపర్ చూపడంతో... ఆ క్రమంలోనే జర్నలిస్టుకు, కిశోర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పీకే కొద్దిసేపు విరామం తీసుకుని నీళ్లు తాగారు.


దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయిన కొద్దిసేపటికే ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 2021 పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుందని తాను వేసిన అంచనా నిజమైందని గుర్తుచేశారు. ‘తాగునీరు చాలా మంచిది.. మెదడు, శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.. ఈ ఎన్నికల ఫలితాలపై నా అంచనాతో కంగారు పడిన వారు జూన్ 4న గొంతు తాడారిపోకుండా నీళ్లు దగ్గర ఉంచుకోవాలి’ అని ట్వీట్‌ చేయడం గమనార్హం.


కాగా, ఎన్డీయే కూటమి 400 సీట్లు దాటుతుందని బీజేపీ సహా ప్రధాని మోదీ చేస్తోన్న ప్రచారంపై మాత్రం పెదవి విరిచారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి ఇప్పుడున్న సంఖ్యకు అటు ఇటుగా మెజార్టీ వస్తుందని అన్నారు. అయిేత, ఆ పార్టీ బలం 270 కంటే దిగువకు కూడా పడిపోదని జోస్యం చెప్పారు. తూర్పు, దక్షిణాదిలో కాషాయ పార్టీ సీట్లు, ఓట్లశాతం పరంగా పురోగతి కనబరుస్తుందని తెలిపారు. బీజేపీను నిలువరించేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని.. కానీ, బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని చేజేతులా పోగొట్టుకుందని ఆయన విశ్లేషించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com