ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలుస్తుంది, కానీ.. ప్రశాంత్ కిషోర్ ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 09:20 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిదేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా వెల్లడించారు. దేశంలో 5 వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. మంగళవారం ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఎన్నికల్లో విజయం బీజేపీదేనని స్పష్టం చేశారు. అయితే లోక్‌సభలో సగం సీట్లే రావాల్సిన బీజేపీ.. 370 పైగా సీట్లు వస్తాయని రాజకీయ ఉపన్యాసాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా చేసి కమలం పార్టీకి క్రెడిట్ ఇచ్చారు. అయితే 370 సీట్లు అందుకోవడంలో మాత్రం బీజేపీ విఫలం అవుతుందని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు.


ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్.. అయితే ఆ పార్టీ చెప్పినట్లుగా 370 స్థానాలు మాత్రం రావని తెగేసి చెప్పారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో 370, 400 సీట్లు సాధిస్తామని బీజేపీ తెలివిగా వ్యవహరిస్తోందని.. అయితే అదే రాజకీయాలను, ప్రజలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఇలా 370, 400 వస్తాయని చెప్పడం.. ఆ పార్టీకి లాభమేనని వెల్లడించారు. అయితే బీజేపీకి 370 సీట్ల కంటే తక్కువ వస్తే.. అది తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.


గత 3, 4 నెలల నుంచి ఎక్కడ చూసినా 370 సీట్లు, 400 సీట్ల గురించే చర్చ జరుగుతోందని చెప్పిన ప్రశాంత్ కిషోర్.. ఇది బీజేపీ వ్యూహంలో భాగమో లేక ప్రతిపక్షాల బలహీనతగా భావించవచ్చని పేర్కొన్నారు. అయితే ఇది మాత్రం బీజేపీ టార్గెట్‌ను 272 నుంచి 370 కి పెరిగేలా చేసిందని తెలిపారు. ఇది తప్పకుండా బీజేపీకే లాభమని చెప్పారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఓడిపోతారని ఎవరూ చెప్పలేరని.. అయితే బీజేపీ చెబుతున్నట్లు 370 సీట్లు మాత్రం రావని వెల్లడించారు. అయితే బీజేపీకి 320 సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 543 స్థానాలున్న లోక్‌సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 సీట్లు గెలుచుకుంటే సరిపోతుంది. ఇక 2014 లో నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్.. బీజేపీ, నరేంద్ర మోదీతో కలిసి పనిచేశారు.


2024 లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని.. కానీ 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే కొంచెం ఎక్కువ స్థానాలు గెలువవచ్చని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. అధికారంలో ఉన్న పార్టీపై కోపం ఉంటే.. ఆ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం ఉండాలని.. అప్పుడే ప్రజలు వారికి ఓటు వేస్తారని చెప్పారు. నరేంద్ర మోదీపై ప్రజల్లో ఆగ్రహం ఉందని చెప్పలేమని పేర్కొన్నారు. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని ప్రాంతాల్లో ఉన్న దాదాపు 325 సీట్లు.. 2014 నుంచి బీజేపీకి బలమైన కోటగా ఉన్నాయని చెప్పారు. తూర్పు-దక్షిణ భారత దేశంలో బీజేపీకి పెద్దగా పట్టు లేదని.. ఏదైనా నష్టం జరిగితే అది ఆ ప్రాంతాల్లోనే జరగాలని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. అయితే ఈసారి మాత్రం బీజేపీకి దక్షిణాదిన, తూర్పున ఓట్లు, సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.


అయితే నరేంద్ర మోదీ చేసిన పొరపాట్లను ఇండియా కూటమి నేతలు సరిగా ఉపయోగించుకోలేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇండియా కూటమి ఏర్పాటే చాలా ఆలస్యం అయిందన్నారు. ఇక ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించడంలో విఫలమైందని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వ్యక్తిని, శక్తిని ఇఇండియా కూటమి చూపించలేకపోయిందని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యం అని చెబుతున్న ప్రతిపక్షాలు గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవిచూసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com