ఏపీలో రైలు ప్రయాణికులకు గురువారం ఇబ్బందిపడ్డారు. పలు రైళ్లు ఆలస్యం కావడంతో రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఆలస్యమైంది. గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ (20833) రైలు ఏకంగా ఐదు గంటలు ఆలస్యమైంది. ముందు సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయని.. ఉదయం 8.45 గంటలకు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. కానీ రైలు ఉదయం 10.45 గంటలకు బయలుదేరి వెళ్లింది. సికింద్రాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (20834).. రాత్రి 8 గంటలకు బయలుదేరింది. వందేభారత్ ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
మరోవైపు రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లాల్సిన కోణార్క్ ఎక్స్ప్రెస్ (11020)ను కూడా భద్రతాపరమైన పనులు ఉండటంతో ఈ నెల 16 నుంచి 31 వరకు దాదర్ వరకు కుదించారు. అంతేకాదు జూన్ 1న ముంబై నుంచి బయల్దేరాల్సిన కోణార్క్ ఎక్స్ప్రెస్ (11019)కూడా దాదర్ నుంచే బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ నెల 16వ తేదీ రాత్రి 11.20 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన విశాఖ-ఎల్టీటీ ఎక్స్ప్రెస్.. 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరుతుంది. ఈ నెల 16వ తేదీ రాత్రి 11.40 గంటలకు బయల్దేరాల్సిన సంత్రాగచ్ఛి-తాంబరం వేసవి ప్రత్యేక రైలు.. 17వ తేదీ ఉదయం 4 గంటలకు సంత్రాగచ్ఛిలో బయల్దేరుతుంది.
మరోవైపు విజయవాడ డివిజన్లో భద్రతా చర్యల పనులు చేపట్టడంతో గుంటూరు - విశాఖ, గుంటూరు - రాయగడ, రాజమహేంద్రవరం -విశాఖ, మచిలీపట్నం- విశాఖ, కాకినాడ పోర్టు- విశాఖ రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ పోర్ట్ - విశాఖపట్నంకు వెళ్లే ప్యాసింజర్ రైలు, మచిలీపట్నం నుంచి విశాఖ వెళ్లే ఎక్స్ప్రెస్ కూడా రద్దయ్యాయి. గుంటూరు - విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖ - గుంటూరు రైళ్లు బుధవారం నుంచి రద్దు చేశారు. గత కొద్దిరోజులుగా రైళ్లను రద్దు చేయడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వేసవి రద్దీ దృష్ట్యా ఏర్పాటుచేసిన పలు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. మే 30 నుంచి జులై 1 వరకు పొడిగించారు.