ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెంకన్న సాక్షిగా కూటమికి వచ్చే సీట్లెన్నో చెప్పిన రఘురామకృష్ణరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 07:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ పూరైంది. పార్టీలతో పాటుగా సామాన్య జనం కూడా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నడూలేనటువంటి రీతిలో పార్టీలన్నీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయం కోసం అన్ని అస్త్రశస్త్రాలు వినియోగించాయి. ఇక పోలింగ్ పూర్తైన తర్వాత కూడా పోలింగ్ సరళి ఎవరికి అనుకూలమనేదానిపై అధికార, విపక్షాలు ఎవరికి తగినట్లుగా వారు చెప్పుకున్నారు. విజయంపై సైతం అన్ని పార్టీల నేతలూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇన్నిసీట్లు వస్తాయంటూ ఢంకా బజాయించి మరీ చెప్తున్నారు. సాక్షాత్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఈ ఎన్నికల్లో తమకు 2019 కంటే మెరుగైన స్థానాలు వస్తాయని ఐప్యాక్ టీమ్‌ను కలిసిన సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.


తాజాగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి, ప్రస్తుతం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన అంచనాను వెల్లడించారు. తిరుమల శ్రీవారిని రఘురామకృష్ణరాజు శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తన అంచనాలు వెల్లడించారు. 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 125 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు. వైసీపీకి కేవలం 25 నుంచి 40 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.


ఏపీ ఎన్నికల్లో పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పిన రఘురామ


తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నానన్న రఘురామకృష్ణరాజు.. పవిత్రమైన దేవుడి సన్ని్ధిలో అబద్ధాలు చెప్పనని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని.. చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇక తన మాట నిజం అవుతుందో.. జగన్ మాట నిజమవుతుందో జూన్ నాలుగో తేదీన తెలుస్తుందన్నారు రఘురామ. ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరగాలని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.


మరోవైపు గురువారం తిరుపతి చేరుకున్న రఘురామకృష్ణరాజు.. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని పరామర్శించారు. అనంతరం శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. ఆఖర్లో టికెట్ దక్కించుకున్న ఆయనకు.. ఉండి మాజీ ఎమెల్యే శివరామరాజు రెబల్ అభ్యర్థి రూపంలో ఇబ్బంది పెట్టారు. టీడీపీకి కంచుకోటలాంటి ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేదీ జూన్ నాలుగో తేదీన తెలియనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com