ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 07:51 PM

తిరుమలలో విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొండపై వేసవి రద్దీ పెద్దగా లేదు.. వేసవి సెలవులైనప్పటికీ శ్రీవారి దర్శనం త్వరగా పూర్తవుతోంది. సాధారణంగా వేసవి సెలవులు మొదలయ్యే మార్చి చివరి వారం నుంచి జూలై నెల చివరి వరకు తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తిరుమలలో రద్దీ ఉంటుంది. కానీ వీకెండ్ మినహా మిగిలిన రోజుల్లో పెద్దగా రద్దీ లేదనే చెప్పాలి.


 భక్తుల రద్దీ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల సీజన్‌ కావడంతో సిఫార్సు లేఖల్ని టీటీడీ అనుమతించడం లేదు. దీంతో చాలామంది తిరుమల పర్యటన వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడంతో కొంతమంది, ఎన్నికల సమయంలో ప్రయాణాలు ఎందుకని మరికొందరు వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 20 రోజులుగా తగ్గింది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి 23వ తేదీ వరకు పరిశీలిస్తే దాదాపు 16,51,341 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 23వ తేదీ వరకు 15 లక్షల మంది భక్తులే శ్రీవారిని దర్శించుకున్నారు.


ప్రత్యేకించి వేసవి సెలవుల్లో శ్రీవారిని సగటున రోజుకు 70 నుంచి 80 వేల మంది దర్శించుకుంటారు. వారాంతాల్లో అయితే 90 వేల వరకు ఆ సంఖ్య పెరుగుతుంది. కానీ పదిరోజులుగా సగటున 60 వేలమంది మాత్రమే దర్శించుకున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో 1.27 లక్షల మంది దర్శించుకోగా, గతేడాది 22, 23 తేదీల్లో 1.47 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం నుంచి శ్రీవారి దర్శనానికి క్యూకాంప్లెక్స్‌లోని షెడ్లలో నిలబడే అవసరం లేకుండా డైరెక్ట్‌ లైన్‌ నడుస్తోంది.


సోమవారం పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినప్పటికీ రద్దీ కనిపించడం లేదు. తక్కువ సమయంలోనే స్వామి దర్శనం పూర్తవుతోంది. పోలింగు సమీపిస్తున్న క్రమంలో తిరుమలలో రద్దీ ఇంకా తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడి గాలుల తీవ్రత కనిపిస్తోంది. ఈ ప్రభావం కూడా తిరుమలపై ఉందంటున్నారు. ఎండల దెబ్బకు కూడా చాలామంది భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటున్నారనే టాక్ ఉంది.


ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు. శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళయ ఉదయం 10.30 నుంచి 11.15 గంటల వరకు చక్రస్నానం నిర్వహఇస్తారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com