ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి సేవకులుగా అద్భుత అవకాశం.. భక్తులు వెంటనే బుక్ చేస్కోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 07:21 PM

తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఈ మేరకు భక్తులు సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం దక్కించుకోవచ్చు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.


తిరుమల శ్రీవారి సేవలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తోంది టీీడీ. శ్రీవారి సేవలో భాగంగా టీటీడీకి చెందిన అన్ని విభాగాల్లోనూ భక్తులు పాలుపంచుకుంటారు. స్వామివారి సేవ కోసంవచ్చిన వారికి భోజనం, బసతోపాటు చివరి రోజు స్వామి దర్శనభాగ్యం కల్పిస్తోంది టీటీడీ. 2000లో శ్రీవారి సేవ వ్యవస్థను తీసుకొచ్చింది టీటీడీ.. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడం, ఇతర సేవల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపే వారి కోసం శ్రీవారి సేవకులు పేరుతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ వెబ్‌సైట్, యాప్ ద్వారా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుని ఎంపికైన భక్తులు సర్వీసులను టీటీడీ అధికారులు.. తిరుమల, తిరుపతి, నవనీతం, పరాకమణి సేవల్లో వినియోగించుకుంటారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు చేరుకునే భక్తుల రద్దీని నియంత్రించడం, హుండీ లెక్కింపు వంటి ప్రదేశాల్లో శ్రీవారి సేవకుల సర్వీసులను అధికారులు వినియోగించుకుంటారు. తిరుమలలో క్యూ లైన్లు, కంపార్ట్ మెంట్లు, ఆలయ పరిసరాలు, వెంగమాంబ అన్నదాన సత్రం, పరాకమణి, లడ్డూ కౌంటర్లు.. వంటి చోట్ల సేవకుల్ని అందుబాటులోకి ఉంచుతారు. శ్రీవారి సేవకులుగా సర్వీసులను అందజేయాలనుకునే వారి కోసం కొన్ని నియమ నిబంధనలు, మార్గదర్శకాలను కూడా అధికారులు రూపొందించారు.


10 మంది భక్తులను ఒక్కో బృందంగా టీటీడీ అధికారులు ఎంపిక చేస్తారు. ఈ గ్రూపు సభ్యులు తమ పేరు, అడ్రస్, వయస్సు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. శ్రీవారి సేవకు ఏ కులానికి చెందిన వారైనా అర్హులే.. స్వామివారి సేవలో పాల్గొనేవారు తప్పనిసరిగా తిరునామం లేదా తిలకాన్ని ధరించాలి. కుంకుమ లేదా చందనాన్ని బొట్టుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. తిరుమల సేవా సదన్‌లో ఈ టీమ్ రిపోర్ట్ చేయాలి. శ్రీవారి సేవకుల వయస్సు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. మెడికల్ సర్టిఫికెట్‌ను టీటీడీ అధికారులకు అందజేయాలి. శ్రీవారి సేవకులకు ఉచిత బస లభిస్తుంది. విధులు ఎక్కడ?.. ఎన్ని గంటల షెడ్యూల్ ను ఒకరోజు ముందే తెలియజేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఈ డ్యూటీ ఛార్ట్ ప్రిపేర్ అవుతుంది.


శ్రీవారి సేవలకులు రోజుకు కనీసం ఆరు గంటల పాటు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి. శ్రీవారి సేవ కోసం వచ్చే వారికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు. ధన, వస్తు రూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఆయా సేవలన్నీ స్వచ్ఛందమే.. శ్రీవారి మీద భక్తితో మాత్రమే వలంటీర్లు ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. శ్రీవారి సేవకు వచ్చే పురుషులు తెలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. మహిళలు ఆరెంజ్ రంగు చీర ధరించాలి. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com