సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సంస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జీని పెందుర్తికి మార్చింది. అక్కడ ఇన్చార్జిగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్చార్జి నియామకం చర్చకు రాగా...తన కుమారుడు వంశీకి అవకాశం ఇవ్వాలని బాబ్జీ కోరారు. ఇదే సమయంలో జీవీఎంసీలో పార్టీ ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కూడా పెందుర్తి ఇన్చార్జి పదవి ఆశించారు. కానీ చివరకు బాబ్జీని నియమిస్తూ బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఇక ఇటీవల పార్టీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. విశాఖ దక్షిణ టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ను ఉత్తర నియోజకవర్గం ఎన్నికల కో-ఆర్డినేటర్గా నియమించారు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గానికి పార్టీ నుంచి ఇన్చార్జి ఎవరూ లేకపోవడంతో నజీర్కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.