రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గురువారం పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడాదికి రూ.200 కోట్లు నికర లాభాల్లో ఉన్న ఏపీ పేపరుమిల్లు యాజమాన్యం అందులో పనిచేసే 2500 మంది కార్మికుల వేతన ఒప్పందాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఏప్రిల్ 2 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు 23 రోజులుగా పేపర్ మిల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం సుమారు 2,800 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే అర్థాంతరంగా పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లు గేటు వద్ద కార్మికులు చేరడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాగా... ఇటీవల బస్సు యాత్రలో పేపర్ మిల్లు మీదుగా వెళ్తున్న సీఎం జగన్ దృష్టికి కార్మికులు తమ సమస్యను తీసుకెళ్లారు. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే మిల్లును యాజమాన్యం లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు మండిపడుతున్నారు.