ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో ‘నాడు మార్నింగ్, ఈవినింగ్ వాక్ ’ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు, స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు. ఎక్కడెక్కడ ఏయే భూములు దోచుకోవాలో అప్పుడే లిస్ట్ తయారు చేసుకున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే ఆ స్థలాల దోపిడీపై జగన్ దృష్టి పెట్టారని, అసైన్డ్ భూములను లాక్కునేందుకు పేదలపై లాఠీఛార్జి చేయించారని, ప్రభుత్వ భూములు వేల ఎకరాలను తన అనుయాయుల పేరుతో దోచేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. పరిశ్రమలు ఏర్పాటు పేరుతో అప్పనంగా అప్పగించేశారని, ఏ ప్రాంతంలో కూడా ఒక్క పరిశ్రమ లేదని, ఉద్యోగం, ఉపాధి లేదని విమర్శించారు. ఒక ప్రణాళిక బద్దంగా ఈ భూదోపిడీ జరిగిందనేది వాస్తవమని.. ప్రభుత్వ ఆస్తులు కూడా తనఖా పెట్టిన ఘనుడు జగన్ అని దుయ్యబట్టారు.