ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా ఆ సేవలు.. చమురు కంపెనీల ప్రకటన!

international |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 10:08 PM

దేశీయ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త అందించాయి. గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా సేఫ్టీ చెక్ చేయించాలని నిర్ణయించినట్లు తాజాగా ప్రకటించాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ కార్యక్రమం చేపట్టనున్నాయి. గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ సేవలు పొందవచ్చు. సెఫ్టీ చెక్ చేసే సిబ్బంది నేరుగా వినియోగదారుడి ఇంటికి వెళ్లి గ్యాస్ కనెక్షన్ పని చేస్తున్న తీరు, లీకేజీల వంటివి తనిఖీ చేస్తారు.


గ్యాస్ కనెక్షన్ లో ఏవైనా లోపాలు కనిపిస్తే వాటిని వెంటనే మార్చాలని సూచిస్తారు. గ్యాస్ పరికరాలు ఎన్నాళ్లు వాడాలి, వాటిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత వంటి అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తారు. ఈ సెఫ్టీ చెకింగ్ మొత్తం ఉచితంగా ఉంటుందని ప్రభుత్వ చమురు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. గ్యాస్ డెలివరీ చేసేందుకు వచ్చిన సిబ్బంది అదే సమయంలో మొత్తంగా 8 భద్రతా నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ చెక్ చేస్తారని పేర్కొన్నాయి. అలాగే ఈ 8 భద్రతా నిబంధనలపైనా వినియోగదారులకు అవగాహన కల్పిస్తారని తెలిపాయి.


సాధారణంగా గ్యాస్ వినియోగంపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం ప్రతి వినియోగదారుడు ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా గ్యాస్ ఇన్‌స్టాలేషన్, రెగ్యులేటర్, గ్యాస్ పైపు వంటి పరికరాలను సంబంధించి డబ్బులు ఇచ్చి సేఫ్టీ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రూ. 200 తో పాటు 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చమురు సంస్థలే ఈ సెఫ్టీ చెకింగ్ చేపిస్తున్నాయి. సేఫ్టీ చెకింగ్ సందర్భంగా కాషాయ రంగు పైపు పనికి రాదని తేలితే వెంటనే రూ. 150 చెల్లించి మార్చుకోవాల్సి ఉంటుంది.


' ఈ సేఫ్టీ చెకింగ్ అనేది ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. రానున్న 3 నుంచి 4 నెలల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న 30 కోట్ల మంది గ్యాస్ వినియోగదారుల ఇళ్లకు చేరుకోవాలనేది టార్గెట్ గా పెట్టుకున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సేఫ్టీ చెకింగ్ ప్రాసెస్ చేపడుతున్నాం. ఎల్‌పీజీ కనెక్షన్ వినియోగిస్తున్న సమయంలో కన్జ్యూమర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సందర్భంలో ఈ సేఫ్టీ చెకింగ్ అనేది తప్పనిసరి.' అని తెలిపారు ఆల్ ఇండియా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ప్రెసిడెండ్ చంద్ర ప్రకాశ్. గ్యాస్ వినియోగదారుల భద్రతే తమ ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com