ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాన్సన్ బేబీ పౌడర్‌‌‌లో కేన్సర్ కారకాలు.. మహిళ మృతి.. రూ.375 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం

international |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 10:04 PM

ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కి అమెరికా కోర్టు షాకిచ్చింది. ఓ మహిళ కుటుంబానికి 45 మిలియన్ డాలర్లు (రూ.375 కోట్లు( పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌ కారణంగా కేన్సర్ సోకుతుందని ఆరోపిస్తూ ఇల్లినాయిస్‌కు చెందిన థెరిసా గ్రేసియా అనే మహిళ కోర్టులో కేసు వేశారు. దాదాపు పదేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం.. ఆమెకు తీర్పు అనుకూలంగా వచ్చింది. అయితే, తీర్పు వెలువడటానికి ముందే ఆమె 2020లో కేన్సర్‌తో చనిపోయారు. తాజాగా, తీర్పు వెలువరించిన కోర్టు.. బాధిత కుటుంబానికి జాన్సన్ సంస్థ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.


మెసోథెలిమా అనే అరుదైన కేన్సర్‌తో 2020లో థెరిసా గ్రెసియా మృతి చెందారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జాన్సన్ అండ్ జాన్సన్, కెన్‌వ్యూ సంస్థలపై కేసు వేశారు. ఈ సంస్థలు విక్రయించే టాల్కర్ టాల్కమ్ పౌడర్‌లో ప్రమాదకర ఆస్బెస్టాస్ (రాతినార) ఉందని ఆరోపించారు. ఈ అవశేషాల వల్లే థెరిసా కేన్సర్ బారినపడ్డారని పేర్కొన్నారు. మెసోథెలిమా చాలా అరుదైన కేన్సర్.. ఊపిరితిత్తులు లేదా పొత్తికడుపులోని పొరల్లో ఈ కణాలు పెరుగుతాయి. రాతినారను ఎక్కువగా తాకినప్పుడు, ఆ దుమ్ముని పీల్చినప్పుడో శరీరంలోకి చేరి కేన్సర్‌‌గా మారుతుంది.


ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు థెరిసా మృతికి కెన్‌వ్యూ 70%, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 30 శాతం కారణమని స్పష్టం చేసింది. అయితే...జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మాత్రం తాము తయారు చేస్తున్న టాల్కమ్ పౌడర్‌లో ఎటువంటి కేన్సర్ కారకాలు లేవని వాదిస్తోంది. దాదాపు వందేళ్లుగా తమ ఉత్పత్తిని సరైన విధంగానే బ్రాండింగ్ చేసుకుంటున్నట్టు వివరించింది. ఇక, కెన్‌వ్యూ సైతం తమ టాల్కమ్ పౌడర్‌ని ఇకపై తయారు చేయమని గత నెలలో వెల్లడించింది.


కోర్టు తీర్పుపై కెన్‌వ్యూ ప్రతినిధి మెలిస్సా విట్‌ను సంప్రదించగా.. ఆమె తక్షణమే స్పందించలేదు. అయితే, జాన్సన్ అండ్ జాన్సన్ అంతర్గత లిటిగేషన్ విభాగం చీఫ్ ఎరిక్ హాస్ మాట్లాడుతూ.. జ్యూరీ తీర్పుపై అప్పీల్ చేస్తామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేని ఈ తీర్పును సవాల్ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా, కెనడాలు 2020లో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేశాయి. గత దశాబ్ద కాలంలో ఆ సంస్థ పౌడర్ అమ్మకాలపై వేలాది మంది భద్రతా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు ఏకంగా 38 వేలకుపైగా వ్యాజ్యాలు కోర్టుల్లో ఉన్నాయి. ఇక, తమ ఉత్పత్తి విక్రయాలను గతేడాది జాన్సన్ సంస్థ నిలిపివేసిన విషయం తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com