ఏపీలో భారీగా బంగారం, డబ్బులు పట్టుబడుతున్నాయి. విజయనగరంలోని కన్యకాపరమేశ్వరి కోవెల సమీపంలో ఈనెల 12న అర్ధరాత్రి చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి భారీగా బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి విజయనగరంలోని బంగారం షాపులకు నగలు అందించేందుకు వచ్చారు. అయితే ఎలాంటి పత్రాలు లేకపోవడంతో 2.6 కిలోల బంగారం, రూ.17.95 లక్షల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం జిల్లా అధికారులకు వివరాలు తెలియజేశామన్నారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో కూడా బిల్లుల్లేకుండా తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలను సీజ్చ ఏశారు. చిత్తూరు జిల్లా బూదనం టోల్ప్లాజా దగ్గర ఉన్న చెక్పోస్టు లో తనిఖీలు నిర్వహిస్తుండగా నెల్లూరు నుంచి మదనపల్లెకు తరలిస్తున్న జీఆర్టీ జ్యువెలరీకి చెందిన బంగారం, వెండిని పరిశీలించామన్నారు. ధృవీకరణపత్రాలు లేకపోవడంతో రూ.4,79,16,247 విలువచేసే 6,986 గ్రాముల బంగారం, రూ. 27,91,879 విలువ చేసే 23,688 గ్రాముల వెండిని సీజ్ చేసి ఆదాయపన్నుశాఖకు అప్పగించామన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వేస్టేషన్లో ఇద్దరు వ్యక్తుల నుంచి డబ్బుల్ని ఎన్ఫోర్స్మెంట్ బృందం జప్తు చేసింది. సీఐ తెలిపిన మేరకు... నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఇద్దరు ప్రయాణికులు శేషాద్రి ఎక్స్ప్రెస్ నుంచి శనివారం రాత్రి దిగారు. వారి ప్రవర్తన అనుమానాస్పద ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో వారి వద్దనున్న బ్యాగ్ను జీఆర్పీ పోలీసులు సోదా చేశారు. అందులో రూ.7 లక్షల నగదు ఉండటాన్ని గమనించారు. సదరు ప్రయాణికులు పెసల పద్మ, పెసల నిఖిల్కుమార్గా గుర్తించారు. పద్మ భర్త గోపాల్ కావలిలో వీఆర్వోగా పనిచేస్తుంటారని సీఐ తెలిపారు. వీరు కావలి నుంచి తమ స్వస్థలమైన గిద్దలూరుకు డబ్బులతో వెళ్తున్నారని చెప్పారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పట్టుకున్న సొత్తును జప్తు చేశామని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సదరు మొత్తాన్ని జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించారు.