ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచి చేసే వారి వెనుక ఎప్పుడూ ఉంటా.. సీఎం రమేష్‌తో చిరంజీవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 07:40 PM

ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లను మనసు దోచుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్నారు. అలాగే తమ పార్టీలోని అసంతృప్త నేతలను కలుస్తూ వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీలైతే ప్రముఖులను కూడా కలిసి వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్.. కొణిదెల చిరంజీవిని కలిశారు. చిరంజీవిని కలిసి ఆయన మద్దతు కోరారు.


టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యి ఎంపీగా పనిచేశారు సీఎం రమేష్. అనంతర పరిణామాల్లో బీజేపీలో చేరిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కీలకమైన అనకాపల్లి స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ. ఈ క్రమంలోనే సీఎం రమేష్.. మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని కోరినట్లు తెలిసింది.


మద్దతు కోసం చిరంజీవిని కలిసిన సీఎం రమేష్.. మెగాస్టార్ ఏమన్నారంటే?


ఇక తనను కలిసిన సీఎం రమేష్‌కు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆల్ ద బెస్ట్ చెప్పారు. అనంతరం మంచిచేసే వారికి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని, ప్రజల పక్షం ఉన్నవారి వెనుక నేనుంటానని మెగాస్టార్ అన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంట.. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకూ ఫలానా పార్టీకి తన మద్దతు అని ప్రకటించలేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం మాత్రం ఇచ్చారు. అయితే ఫలానా పార్టీకి మద్దతుగా నిలవాలని, ఫలానా అభ్యర్థికి ఓటేయాలని మాత్రం కోరలేదు. ఇక సీఎం రమేష్‌ను కలిసిన సమయంలోనూ చిరంజీవి మంచి చేసేవారికి తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు తప్ప పార్టీల పేర్లు ప్రస్తావించలేదు.


మరోవైపు చిరంజీవి ఇప్పటికీ తమ పార్టీలోనే ఉన్నాడని కాంగ్రెస్ వర్గాలు చెప్తుంటాయి. చింతామోహన్ లాంటి సీనియర్ నేతలు అయితే ఎన్నికల్లో పోటీ చేస్తే సీఎం చేస్తామని సైతం స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చిరంజీవి చెప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే బీజేపీకి చెందిన సీఎం రమేష్ చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com