ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన.. బొత్సను ఢీకొట్టేది ఆయనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 07:30 PM

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకూ మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. శుక్రవారం మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. వీటితో పాటు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చింది. కదిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సతీమణి కందికుంట యశోదాదేవికి గతంలో టికెట్ కేటాయించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై ఉన్న నకిలీ డీడీల కేసును నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేయటంతో ఇప్పుడు తిరిగి కందికుంటకే టికెట్ ఇచ్చారు.


మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రత్యర్థిగా చీపురుపల్లికి తొలుత ఆయన పేరు పరిశీలించారు. అయితే విశాఖపట్నం జిల్లాలో పరిధిలోనే పోటీ చేసేందుకు గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీంతో గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు గతంలో పోటీ చేసిన భీమిలినే తిరిగి ఆయనకు కేటాయించారు.


అలాగే సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఇద్దరూ ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఎచ్చెర్ల స్థానం బీజేపీకి వెళ్లింది. దీంతో చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడును టీడీపీ బరిలో నిలిపింది. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఊహించని అభ్యర్థికి టీడీపీ టికెట్ దక్కింది. ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశించారు. తొలుత ఈ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు సీటు దక్కింది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు కేటాయించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com