ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బూడిద ఇచ్చే 'బూడి' కావాలా.. అభివృద్ధి ఇచ్చే మోదీ కావాలా?.. సీఎం రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 07:23 PM

మాజీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీలో ఉన్న సమయంలో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సీఎం రమేష్.. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సింహాచలం అప్పన్నను దర్శించుకుని తన ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం రమేష్. నాగులపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపైనా, అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయడుపైనా విమర్శలు చేశారు.


" బూడి ముత్యాలనాయుడు పంచాయతీ నిధులు విషయంలో విఫలమయ్యారు. ఇక్కడ ఉన్న నాయకులు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఊడిగం చేస్తున్నారు. బూడి ముత్యాల నాయుడు ఎంపీగా గెలిస్తే ఢిల్లీకి వెళ్లి ఏ భాషలో మాట్లాడతారు? మళ్లీ వీళ్లు చెప్పిందే చేయాలి.నేను ఏ సమస్యను అయినా ప్రధాని, కేంద్రమంత్రుల వరకూ తీసుకెళ్తా, కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయితే చూస్తూ ఊరుకోను. స్టీల్ ప్లాంట్‌ను ఆధునికీకరణ చేసి మైన్స్ కెటాయించేలా చేస్తా. మోదీ మూడోసారి ప్రధాని కావటం ఖాయం. జగన్ ఇంటికి పంపడం కూడా ఖాయం. మీకు బూడిద ఇచ్చే బూడి కావాలా.. అభివృద్ధి చేసే మోదీ కావాలో తేల్చుకోండి" అంటూ సీఎం రమేష్ సెటైర్లు వేశారు.


మరోవైపు ఇదే సభలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు." రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు.ప్రజలను మోసం చేసి పాదయాత్ర, బస్సుయాత్ర అంటున్నాడు . రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులను మోసం చేసాడు.పించన్ మూడు వేలు అని చేప్పి ప్రజలను మోసం చేసాడు. మద్యనిషేధం చేసి ఓటు అడుగుతామని చెప్పిన రోజా.. ఇప్పుడు ఏమని అడుగుతుంది.."అంటూ అయ్యన్న విరుచుకుపడ్డారు.


మరోవైపు రాష్ట్ర భవిష్యత్తు కోసం త్రివేణి సంగమంలా త్రిమూర్తులు కలిశారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ పొత్తుకు పవన్ కల్యాణ్ మూలకారణమన్నారు.అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్‌ని గెలిపించి కేంద్రంలో మరోసారి మోదీ విజయాన్ని బలపర్చాలని కోరారు. మోదీ,చంద్రబాబు ఇద్దరు పెద్దన్నల ముద్దుల తమ్ముడు పవన్ కళ్యాణ్ అని కొణతాల అభిప్రాయపడ్డారు.సీఎం కానీ సీఎం అంటే సీఎం రమేష్ అని చెప్పిన కొణతాల రామకృష్ణ.. సీఎం రమేష్‌ను గెలిపిస్తే సీఎం, పీఎం ఇద్దరూ మన దగ్గర ఉన్నట్లేనని అనకాపల్లి ప్రజలకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com