ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జై శ్రీరాం అంటూ రాహుల్ గాంధీకి ఆలుగడ్డలు గిఫ్ట్ ఇచ్చిన బీజేపీ కార్యకర్తలు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 11:12 PM

భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య మధ్యలో బీజేపీ కార్యకర్తలు తారసపడుతున్నారు. ఈ క్రమంలోనే వారు జై శ్రీరాం, మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తున్నా.. రాహుల్ గాంధీ మాత్రం వారిని నవ్వుకుంటూ పలకరిస్తున్నారు. అంతే కాకుండా వారికి ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ అక్కడి నుంచి ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. కొన్నిసార్లు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కూడా తలెత్తిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగిస్తున్న రాహుల్ గాంధీకి బీజేపీ కార్యకర్తలు ఎదురయ్యారు.


మంగళవారం మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ నగరంలో రాహుల్ గాంధీ యాత్ర సాగింది. ఈ నేపథ్యంలోనే కాషాయ జెండాలు పట్టుకుని జై శ్రీరాం, మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ.. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనం వద్దకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో వారిని చూసిన రాహుల్ గాంధీ.. వాహనాన్ని ఆపి కిందికి దిగి వారి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి ఆలుగడ్డలు బహుమతిగా ఇచ్చారు. కొందరు కార్యకర్తలు చేతుల్లో ఆలుగడ్డలు తీసుకువచ్చి రాహుల్ గాంధీ చేతుల్లో పెట్టారు.


బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం, మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తున్నా రాహుల్ గాంధీ మాత్రం చాలా సహనం, ఓర్పుతో వారితో నవ్వుతూ ముచ్చటిస్తూ వారు ఇచ్చి ఆలుగడ్డలను తీసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ.. తిరిగి వెళ్లి తన వాహనం ఎక్కి అక్కడి నుంచి ముందుకు కదిలారు. వారు ఎంత రెచ్చగొట్టినా ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఈ నేపథ్యంలోనే రాహుల్‌ గాంధీకి ఆహ్వానం పలకడం, ఆయనకు ఆలుగడ్డలు ఇవ్వడంపై స్థానిక బీజేపీ కార్పొరేటర్ దూబే స్పందించారు. తమ కార్యకర్తలు చేసిన నినాదాలను రాహుల్ గాంధీ ఎంతో హుందాగా స్వీకరించారని.. తాము కూడా ఆయనకు స్వాగతం పలికినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి బంగాళదుంపలు బహుకరించినట్లు వెల్లడించారు. అయితే రాహుల్‌ గాంధీకి ఆలుగడ్డలు బహుకరించడం వెనుక ఒక చిన్న కథ ఉందని బీజేపీ కార్యకర్తలు తెలిపారు. ఆలుగడ్డలను బంగారంగా మార్చవచ్చు అని గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ పాత సంఘటనను వారు గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ నగరంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీకి ఆలుగడ్డలు గిఫ్ట్‌గా ఇవ్వడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com