ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై ప్రధాని మోదీ.. యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి తనిఖీలు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 11:50 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. గుజరాత్‌ పర్యటనలో తీరిక లేకుండా గడిపిన ప్రధాని మోదీ.. ఆ వెంటనే వారణాసికి చేరుకున్నారు. గురువారం రాత్రి తన సొంత నియోజకవర్గం అయిన వారణాసి చేరుకున్న ప్రధాని మోదీ.. స్థానికంగా ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగానే కొత్తగా నిర్మించిన శివ్‌పుర్‌- ఫుల్‌వరియా - లహ్‌రతారా మార్గ్‌ను అర్ధరాత్రి 11 గంటలకు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో అవి తెగ వైరల్‌గా మారాయి. ఎయిర్‌పోర్ట్, లక్నో, అజంగఢ్, ఘాజీపూర్ వైపు వెళ్లాలనుకునే వారికి.. దక్షిణ భాగంలో నివసిస్తున్న సుమారు 5 లక్షల మంది ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.


శివ్‌పుర్‌- ఫుల్‌వరియా - లహ్‌రతారా మార్గ్‌ను రూ.360 కోట్లతో నిర్మించగా.. దాన్ని ఇటీవలే ప్రారంభించారు. దీని వల్ల దక్షిణ వారణాసి ప్రాంత ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయం దాదాపు సగం తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలా అర్ధరాత్రి రోడ్లపై తనిఖీలు చేయడానికి ముందు వారణాసి రోడ్లపై ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు. రాత్రి పూట అయినప్పటికీ.. ప్రధాని మోదీని చూసేందుకు జనం రహదారుల వెంట బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రధానిపై పూలవర్షం కురిపించారు.


ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. యూనివర్సిటీలోని స్వతంత్ర భవన్‌లో ఎంపీ నాలెడ్జ్ పోటీ, ఎంపీ ఫొటోగ్రఫీ పోటీలు, ఎంపీ సంస్కృతం పోటీల్లో పాల్గొనే విద్యార్థులతో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా ఐదుగురు ప్రముఖులను కూడా ప్రధాని సత్కరించారు. ఇక ఈ ఉదయం 11.15 గంటలకు సంత్ గురు రవిదాస్ జన్మస్థలాన్ని దర్శించుకున్నారు. అనంతరం సెయింట్ గురు రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.


ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి ప్రధాని ఒక ట్వీట్ చేశారు. "కాశీకి చేరుకున్నప్పుడు శివపూర్-ఫుల్వారియా-లహర్తారా రహదారిని పరిశీలించాను. ఈ ప్రాజెక్ట్ ఇటీవల ప్రారంభించబడింది. నగరం దక్షిణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది" అని ఆ ట్వీట్‌లో ప్రధాని మోదీ తెలిపారు. ఇక అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని సాకారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. అదే క్రమంలో రూ.13 వేల కోట్లకు పైగా విలువైన వివిధ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కానుకగా ఇచ్చేందుకు ప్రధాని మోదీ వారణాసికి విచ్చేస్తున్నారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com