ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ వల్లే 8 మంది నేవీ మాజీ ఆఫీసర్లు ప్రాణాలతో తిరిగివచ్చారు.. స్వయంగా కేసు పర్యవేక్షణ

national |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 10:53 PM

ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులు.. ప్రస్తుతం సురక్షితంగా భారత్ చేరుకున్నారు. గూఢచర్యం కేసులో వారికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించగా.. ఇక వారి కుటుంబ సభ్యుల రోదన అంతా ఇంతా కాదు. ఇక ఏం చేయలేమని ఆశలు అన్నీ వదులుకున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వారు మరణ శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా భారత్‌కు కూడా చేరుకోవడం ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతోపాటు దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 8 మంది భారత నేవీ మాజీ అధికారులు.. కేసు నుంచి బయటపడి.. స్వదేశానికి చేరుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర కృషి చేశారని కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు.


ఈ నేపథ్యంలోనే బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఖతార్‌లో పర్యటించనున్నట్లు వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనున్నట్లు వివరించారు. యూఏఈ పర్యటన ముగిసిన తర్వాత మోదీ బుధవారం ఖతార్‌లోని దోహాకు వెళ్లనున్నట్లు చెప్పారు. అయితే 8 మంది భారత మాజీ నేవీ అధికారులు.. భారత్ చేరుకున్న రోజే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 8 మందిలో ఏడుగురు అధికారులు సోమవారం తెల్లవారుజామున వారి ఇళ్లకు చేరుకోగా.. మరో అధికారి త్వరలోనే చేరుకుంటారని అధికారులు వెల్లడించారు.


ఈ కేసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించినట్లు వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. గూఢచర్యం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు అక్కడి కోర్టు గత ఏడాది అక్టోబర్‌లో మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు తమ వారిని రక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌కు విజ్ఞప్తి చేశాయి. దీంతో ఈ కేసును కీలకంగా పరిగణించిన కేంద్రం వారి మరణ శిక్షను రద్దు చేయించడమే కాకుండా సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.


ఖతార్‌లో దాదాపు 8.5 లక్షల మంది భారతీయులు ఉన్నారని వినయ్ మోహన్ క్వాత్రా పేర్కొన్నారు. ఇరు దేశాల అధినేతలు భేటీ అయి.. భారత్, ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఇక 2022 ఆగస్టులో అరెస్ట్ అయిన 8 మంది అధికారులను విడుదల చేస్తూ ఖతార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ అభినందించింది. ఈ క్రమంలోనే కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com