ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్రంగా నష్టపోయాం.. ఆదుకోండి.. ప్రధానికి చంద్రబాబు లేఖ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2023, 07:01 PM

మిచౌంగ్ తుపాను వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మిచౌంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి.. కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని లేఖలో కోరారు. తుపాను కారణంగా 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న చంద్రబాబు.. ప్రాణ, ఆస్థినష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తుఫాను తీవ్రత దృష్ట్యా మిచౌంగ్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని15 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిందని ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు తెలియజేశారు.100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతీశాయని అన్నారు.తుఫాను కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రాథమిక అంచనాల ప్రకారం తుపాను కారణంగా 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వివరించారు. రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందన్న చంద్రబాబు.. అనేక జిల్లాలలోపంటలు దెబ్బతినడంతో పాటు పశువులు చనిపోయాయని లేఖలో వివరించారు. దాదాపు 770 కి.మీల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.


తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందన్న టీడీపీ అధినేత..తుఫాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు లేఖ ద్వారా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల పడవలు, వలలకు కూడా నష్టం జరిగిందనీ... వారు జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదన్న చంద్రబాబు నాయుడు.. తమిళనాడుపై కూడా ప్రభావం చూపినట్లు లేఖలో పేర్కొన్నారు.తుఫాను తీవ్రత, నష్టం దృష్ట్యా మిచౌంగ్ తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని.. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని ప్రధాని మోదీని కోరారు. మిచౌంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటిస్తే తక్షణ, మెరుగైన సహాయం బాధితులకు అందుతుందని... మీ ప్రకటన ద్వారా తుఫాను బాధితులలో విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుందని టీడీపీ అధినేత ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com