ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లోనే కూర్చుని సంపాదన అంటే నమ్మొద్దు.. 100కిపైగా వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:12 PM

వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, టాస్క్‌-ఆధారిత పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్లపై చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు దాదాపు 100కుపైగా వెబ్‌సైట్లను కేంద్ర ఐటీ సమాచార ప్రసార శాఖ నిషేధించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వెబ్‌సైట్లను విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నారని అందులో పేర్కొంది.


వ్యవస్థీకృతంగా అక్రమ పెట్టుబడులు, పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్‌ నేరాలపై హోం శాఖకు చెందిన ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (I4C) విభాగం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే గతవారం ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న కొన్ని వెబ్‌సైట్లను గుర్తించి.. వాటిని తక్షణమే నిషేధించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ తమ ప్రత్యేక అధికారాలతో 100కి పైగా వెబ్‌సైట్లపై నిషేధించింది. ఆర్థిక నేరాలను ప్రోత్సహిస్తున్న ఈ సైట్లను విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్నారని వెల్లడించింది.


డిజిటల్‌ ప్రకటనలు, చాట్ మెసెంజర్స్‌, రెంటెడ్‌ అకౌంట్లను వినియోగించి వీరు తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు గుర్తించింది. ఆర్థిక మోసాల ద్వారా వచ్చిన సొమ్మును క్రిప్టో కరెన్సీ, విదేశీ ఏటీఎం కార్డులు, ఇంటర్నేషనల్‌ ఫిన్‌టెక్‌ కంపెనీల సాయంతో మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్టు తాము గుర్తించామని ఐటీశాఖ పేర్కొంది. అయితే, నిషేధించిన వెబ్‌సైట్ల వివరాలను మాత్రం కేంద్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా పార్ట్‌టైం జాబ్‌‌లు పేరుతో జరుగుతున్న మోసాలపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ‘ఇంట్లోనే కూర్చుని సంపాదన’ వంటి ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు ఆకట్టుకుంటారని, రిటైర్డ్‌ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులను ఎక్కువగా టార్గెట్‌ చేస్తారని తెలిపింది. ‘అలాంటి ప్రకటన క్లిక్ చేయగానే.. వారి ఏజెంట్లు వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి మాధ్యమాల్లో వినియోగదారులతో మాట్లాడుతారు. వీడియోలు లైక్‌ చేయడం, సబ్‌స్క్రైబ్‌ చేయడం, రేటింగ్‌ ఇవ్వడం వంటి టాస్క్‌లు చేసి ఇంట్లోనే కూర్చుని డబ్బు సంపాదించొచ్చు అంటూ బుట్టలో వేసుకుంటారు. ముందు కొంత కమిషన్‌ ఇచ్చి.. ఆ తర్వాత లాభాల ఆశజూపి పెట్టుబడి మోసాలకు పాల్పడుతారు’ అని కేంద్రం తెలిపింది.


ఇలాంటి మోసాల పట్ల జనం చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దని సూచించింది.ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మహాదేవ్‌ వివాదం నేపథ్యంలో అక్రమంగా బెట్టింగ్‌కు పాల్పడుతోన్న 22 యాప్‌లు, వెబ్‌సైట్లను కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిలో మహదేవ్‌, రెడ్డీఅన్నప్రెస్టోప్రో వంటి యాప్‌లు ఉన్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో చైనా సహా 230కిపై యాప్‌‌లు, వెబ్‌సైట్‌లను నిషేధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com