ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీనియర్లకు ఝలక్.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలుగా కొత్త ముఖాలు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:10 PM

ఐదు రాష్ట్రా శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అఖండ విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వాలను ఏర్పాటుచేయనుంది. అయితే, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా కొత్తవారికి అవకాశం కల్పించనున్నారని బీజేపీ వర్గాలు పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికపై కేంద్ర అధినాయకత్వం చర్చిస్తోందని, ఆశావాహుల పేర్లను పరిశీలిస్తోందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ముఖ్యమంత్రుల ఎంపికపై నాలుగున్నర గంటలకుపైగా సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.


అనంతరం మూడు రాష్ట్రాల ఇంఛార్జిలతో నడ్డా, షాలు పలుసార్లు భేటీ అయి.. ఆశావాహుల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. త్వరలోనే ఈ మూడు రాష్ట్రాలకు కేంద్ర నాయకత్వం పరిశీలకులను నియమించనుంది. వీళ్లు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌‌తో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ సీఎం పదవిని ఆశిస్తున్నారు. ఇక, రాజస్థాన్‌లోనూ వీరి జాబితా పెద్దదిగానే ఉంది. మాజీ సీఎం వసుంధర రాజే సింధియా, లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, జోధ్‌పూర్ యువరాణి దియా కుమారి, బాబా బాలక్‌నాథ్‌లు సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కాగా, వసుంధర రాజే సింధియాకు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనే ప్రచారం సాగుతోంది.


ఇదే సమయంలో మంగళవారం 68 మంది ఎమ్మెల్యేలకు రాజే ఫోన్ చేసి తనను కలవాలని చెప్పినట్లు సమాచారం. వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలు మాజీ సీఎం కలిశారని, కొంతమంది స్వతంత్రులు కూడా ఉన్నారన తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం తాము మర్యాదపూర్వకంగా కలిశామని, పార్టీ నాయకత్వం రాజేని రాష్ట్రంలో సీఎం పదవికి ఎంచుకుంటే మద్దతు ఇస్తామని చెప్పారు.


ఛత్తీస్‌గఢ్‌ విషయానికి వస్తతే మాజీ సీఎం రమణ్ సింగ్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావ్, ధర్మలాల్ కౌశిక్, మాజీ ఐఏఎస్ అధికారి ఓపీ చౌధురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోంది. అయితే, బీజేపీ నాయకత్వం తనదైన ఎంపికలతో ఆశ్చర్యానికి గురిచేయనుంది. వచ్చే ఎన్నికలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కీలకమైన ఈ రాష్ట్రాలకు కొత్త సీఎంలను ఎంపిక చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com