ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచల్ అథ్లెట్స్‌కు వీసా నిరాకరించిన చైనా.. డ్రాగన్‌కు షాకిచ్చిన భారత్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 08:18 PM

ఆసియా క్రీడల్లో పాల్గొనే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ క్రీడాకారులకు వీసాలు, అక్రిడిటేషన్‌ను చైనా నిరాకరించడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా ఉద్దేశపూర్వకంగా కొంతమంది క్రీడాకారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ అడ్డుకుంటోందని శుక్రవారం అధికారిక నిరసన తెలిపింది. అంతేకాదు, ఆసియా క్రీడలకు హాజరుకావాల్సిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆసియా క్రీడలు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకూ జరగనున్నాయి. ఈ ప్రారంభ వేడుకల్లో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ పాల్గొంటారు. భారత్ నుంచి క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరుకావాల్సి ఉంది.


‘చైనాలోని హాంగ్జూలో జరగబోయే 19వ ఆసియా క్రీడలల్లో పాల్గొనే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొంతమంది భారతీయ క్రీడాకారులకు ఉద్దేశపూర్వకంగా ముందస్తు వ్యూహంతోనే చైనా అధికారులు అక్రిడిటేషన్, వీసాలను నిరాకరించి విషయం భారత ప్రభుత్వం తెలుసుకుంది’ అని ఓ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దీర్ఘకాలిక, స్థిరమైన స్థితికి అనుగుణంగా నివాసం లేదా జాతి ప్రాతిపదికన భారతీయ పౌరుల పట్ల వివక్షను భారత్ గట్టిగా తిరస్కరిస్తుంది.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.. ఇది ఎప్పటికీ విడదీయరాని భాగంగానే ఉంటుంది’ అని అరిందమ్ బాగ్చి పునరుద్ఘాటించారు. ఓ ప్రాంతానికి చెందిన భారత అథ్లెట్లను చైనా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంపై ప్రభుత్వం తీవ్ర నిరసనను వ్యక్తం చేసిందని మిస్టర్ బాగ్చీ చెప్పారు.


ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంతోపాటు, బీజింగ్‌లో కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. చైనా చర్యలు ఆసియా క్రీడల స్ఫూర్తిని, వాటి ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించిందని ఆయన అన్నారు. ‘తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉంది’ అని బాగ్చీ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పిలుస్తూ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్, ఆక్సయి చిన్‌‌లను తమవిగా చూపుతూ చైనా కొత్త ప్రమాణిక మ్యాపు విడుదల చేయడం తీవ్ర దుమారం రేగింది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి మ్యాప్‌లను రూపొందించి విడుదల చేయడం చైనాకు అలవాటుగా మారిపోయిందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ విమర్శించారు. మ్యాప్‌లో చూపినంత మాత్రాన ఏదీ మారిపోదని చురకలంటించారు. తమ భూభాగం విషయంలో స్పష్టతతో ఉన్నామని ఉద్ఘాటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com