ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ కెనడాల మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలు,,,రెండు దేశాల మధ్య విమాన టికెట్‌ ధరలకు రెక్కలు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 08:17 PM

భారత్, కెనడాల మధ్య పరిస్థితులు రోజురోజుకూ తీవ్ర రూపు దాల్చుతున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది. ఆ వెంటనే ఇరు దేశాలు రాయబారులను బహిష్కరించుకోవడం.. కెనడియన్లకు ఇచ్చే వీసాలను భారత్ తాత్కాలికంగా నిలిపివేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎగబడుతుండటంతో విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.


ప్రస్తుతం భారత్‌ కెనడాల మధ్య విమాన ప్రయాణాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదం కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ పర్యటనల్లో మార్పులు చేసుకోవడంతో విమాన ప్రయాణాలు అకస్మాత్తుగా పెరుగుతున్నట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్‌ కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతానికి పైగా పెరిగినట్లు ట్రావెల్ ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌కు వచ్చే కెనడియన్లకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించడంతో ఢిల్లీ నుంచి టొరంటో మధ్య నడిచే విమానాలకు డిమాండ్ భారీగా పెరిగిందని తెలిపాయి. దీంతో చివరి నిమిషంలో భారీగా టికెట్‌ బుకింగ్స్‌ చేసుకున్నట్లు వెల్లడించాయి.


ఇక భారత్‌ కెనడాల మధ్య ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ కెనడాలు విమానాలను నడుపుతున్నాయి. రెండు దేశాల మధ్య వారానికి 48 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు ఢిల్లీ నుంచి టొరంటో.. ఢిల్లీ నుంచి వాంకోవర్‌ మధ్య ఎయిర్‌ ఇండియా తన విమానాలను నడిపిస్తోంది. ఇక ఢిల్లీ నుంచి టొరంటోకు ప్రతి రోజూ ఎయిర్‌ కెనడా విమానయాన సంస్థ విమాన ప్రయాణాలను నిర్వహిస్తోంది. దీనికితోడు వారంలో మూడు సార్లు ఢిల్లీ నుంచి మాంట్రియల్‌ మధ్య విమానాలను ఎయిర్ కెనడా సంస్థ నడిపిస్తోంది.


అంతర్జాతీయ ఎయిర్‌ ట్రాఫిక్‌ మార్కెట్‌లో భారత్‌-కెనడా వాటా 1.2 శాతం కాగా, కెనడా విమాన రవాణాలో భారత్‌ నాలుగో అతిపెద్ద దేశంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య 6.8 లక్షల మంది రాకపోకలు సాగించారు. తాజాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ-టొరంటో మధ్య విమాన టికెట్‌ ధరల గురించి విచారించే వారి సంఖ్య పెరిగిందని ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com