ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై సభలోకి మొబైల్స్‌కు నో పర్మిషన్,,,ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 08:01 PM

ఏపీ అసెంబ్లీలోకి సభ్యులు మొబైల్స్ తీసుకురాకుండా, వాటిని ప్రవేశ ద్వారం దగ్గర డిపాజిట్‌ చేసే విధానం తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. జీరో అవర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యేలుఆందోళన చేస్తున్న సమయంలో మొబైల్‌తో వీడియో తీసిన అంశాన్ని ప్రస్తావించారు. అసలు సభలోకి మొబైల్స్ తేవచ్చా.. ఒకవేళ తెస్తే వీడియో తీయొచ్చా అన్నారు. వీడియో తీస్తే ఎటువంటి చర్యలు ఉంటాయో తెలపాలని కోరారు. దీనిపై రూలింగ్‌ ఇవ్వాల్సి ఉందన్నారు స్పీకర్. మొబైల్స్, టేప్‌రికార్డర్లు సభలోకి, గ్యాలరీల్లోకి తీసుకువస్తే సీజ్‌ చేయాలని ఉందని తెలిపారు. అలాగే సభలో వీడియో తీసిన సభ్యుడిని సస్పెండ్‌ చేశామని.. దీనిపై ఎథిక్స్ కమిటీకి రిఫర్‌ చేస్తామని పేర్కొన్నారు. జీరో అవర్‌లో పలువురు ఎమ్మెల్యేలు వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.


మరోవైపు గురువారం నుంచి అసెంబ్లీ ప్రారంభంకాగా.. ప్రశ్నోత్తరాల సమయం మొదలైన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ చేపట్టాలని నిరసన చేపట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు.. ప్లకార్డులతో నినాదాలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు స్పీకర్‌ టేబుల్‌పై ఉన్న కాయితాలను చించి గాల్లోకి విసిరారు. ఆ క్రమంలో వారి చేయి తగిలి నీళ్లతో ఉన్న గ్లాసు టేబుల్‌పై పడిపోయి, కాగితాలు తడిసిపోయాయి. దీంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. శ్రీధర్‌రెడ్డి తదితరులు స్పీకర్‌ టేబుల్‌కి అమర్చిన మానిటర్‌ను లాగే ప్రయత్నం చేశారు. మంత్రి బుగ్గన సరైన ఫార్మాట్‌లో వస్తే చర్చకు సిద్ధమన్నారు.


టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్లపై కొడుతున్నవాళ్లు.. నిజంగా చంద్రబాబుపై గౌరవం ఉంటే బల్ల కొట్టాల్సింది ఇక్కడ కాదు కోర్టులో అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయమని అడగాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీ నుంచి తీసుకొస్తున్న న్యాయవాదులతో హైకోర్టులోను. సుప్రీంకోర్టులోను, మఫిసిల్‌ కోర్టులోను వాదించుకోవాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఇలాగే కొనసాగితే, వైఎస్సార్‌సీపీ సభ్యులూ రెచ్చిపోయే ప్రమాదం ఉందని, అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియంపై ఉన్న టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి అంబటి మీసం తిప్పుతూ సవాళ్లు చేసుకున్నారు. బాలకృష్ణ సినిమాల్లో చూపించమనండి.. ఇక్కడ మీసాలు తిప్పడం కాదు అన్నారు అంబటి రాంబాబు. దమ్ముంటే రా అంటూ రెచ్చగొట్టారు. టీడీపీ సభ్యులు స్పీకర్‌పై దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా కనిపిస్తోంది అన్నారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సీరియస్ అయ్యారు.


ఒకపక్క ఆ గొడవ జరుగుతుండగానే.. నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశ పెట్టారు. శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌లను ప్రస్తుత సమావేశాల జరిగినంత కాలం, మిగతా టీడీపీ సభ్యుల్ని, ఉండవల్లి శ్రీదేవిని ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో సభలో మొబైల్‌తో వీడియో తీయడంతో స్పీకర్ మండిపడ్డారు. వాటీజ్‌దిస్‌ యూజ్‌లెస్‌ఫెలో.. ఎవడురా చెప్పారు.. వీడియోస్‌ ఆర్‌ ప్రొహిబిటెడ్‌ అంటూ ఘాటుగా స్పందించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com