ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు, పవన్‌లను తిట్టడమే మంత్రుల పనా,,,నట్టి కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 07:31 PM

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు నిర్మాత నట్టికుమార్‌. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. ప్రజా సమస్యలపై చర్చలు, సమీక్షలు జరగాల్సిన దేవాలయం లాంటి శాసనసభలో మంత్రి కులాల ప్రస్తావన తీసుకురావడం, గొడవలకి వేదికగా చేసుకుని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ను తిట్టడమే మంత్రులకి పనా అన్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన తెలిపే హక్కు, వాదన వినిపించే స్వేచ్ఛ ఆ పార్టీ ఎమ్మెల్యేలకి ఉంటుందన్నారు నట్టి కుమార్. ఈ దేవాలయంలో ఎన్నో బిల్లులపై చర్చలు జరుగుతాయని, వాటిని ఆమోదిస్తారన్నారు. మంత్రులు తమకి కేటాయించిన శాఖల్లో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ప్రజలకి చెప్పాలన్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను లక్ష్యంగా చేసుకుని మరో మంత్రి రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.


అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అరెస్ట్‌‌పై ప్రశ్నించే హక్కు, నిరసన వ్యక్తం చేసే హక్కు, తమ అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ టీడీపీకి ఉన్నాయన్నారు. ఈ అంశంపై చర్చ జరగకుండా వైసీపీ వాళ్లు చీప్ ట్రిక్స్‌తో అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీతీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని.. వారి పట్ల చులకన భావం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలన్నారు. సభలో ఏదైనా నిర్ణయం స్పీకరు తీసుకుంటారని.. ఇందులో అంబటి రాంబాబు జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. అంబటి రాంబాబు జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ వారికి వార్నింగ్ ఇవ్వడం, రెచ్చగొట్టడం కరెక్ట్ కాదన్నారు. సభలో మిగతా ఎమ్మెల్యేలలా ఆయనా ఓ సభ్యుడన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు.


అసెంబ్లీ సమావేశాలు కోట్లాది రూపాయల ప్రజాధనంతో జరుగుతున్నాయని.. అవసరమైన చర్చ జరగకుండా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను తిట్టడానికే పరిమితమవుతున్నారన్నారు. తాను కాపు బిడ్డనంటూ అంబటి కులాల ప్రస్తావన తీసుకు రావడం సరికాదన్నారు. మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడాలన్నారు. తన మావయ్య చంద్రబాబు బయటకు రావాలని బ్రాహ్మణి ఆరాటపడుతున్నారని.. తోటి మహిళగా సంఘీభావం తెలపకపోయినప్పటికీ కనీసం టార్గెట్ చేయడం సరికాదన్నారు. రోజా తన పర్యాటక శాఖలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాలన్నారు నట్టికుమార్. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా తన శాఖకు సంబంధించిన అభివృద్ధిపై రివ్యూలు చేస్తే బావుంటుంది అన్నారు. ఎన్ని పరిశ్రమలను ఏపీకి తీసుకుని రాగలిగాం?.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం వంటి వాటిపైన చర్చలు జరిపితే బావుంటుంది అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com