నిపా వైరస్ కారణంగా కేరళ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతుండగా.. కొత్తగా స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఒడిశా రాష్ట్రం భయపడిపోతోంది. రోజురోజుకూ ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఒడిశాలో 180 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు ఒడిశా హెల్త్ డిపార్ట్మెంట్ గణాంకాలు వెల్లడించింది. అందులో తాజాగా ఒక్క సుందర్గఢ్ జిల్లాలోనే 11 స్క్రబ్ టైఫస్ కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలోనే కొత్త రకం వ్యాధితో ఒడిశా వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకినట్లు భావిస్తున్నా.. అలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి అధికారులు తాజాగా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 59 మంది శాంపిళ్లు పరీక్షించగా అందులో 11 మందికి స్క్రబ్ టైఫస్ వ్యాధి ఉందని తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులతో మొత్తం ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 180 కి చేరినట్లు చెప్పారు. ఇందులో 10 మంది బాధితులు ఒడిశా కాకుండా ఇతర రాష్ట్రాల వారు కాగా.. 9 మంది ఇతర జిల్లాల నుంచి ఉన్నట్లు సుందర్గఢ్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కన్హు చరణ్ నాయక్ వివరించారు. ఇక సుందర్గఢ్ జిల్లాలో శనివారం శనివారం 7 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లక్షణాలు ఉన్నవారు వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికైనా 4, 5 రోజులు వరుసగా జ్వరం ఉంటే వెంటనే వారు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ స్ర్కబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రి, సుందర్గఢ్ జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ స్ర్కబ్ టైఫస్ వ్యాధి విస్తరిస్తున్న వేళ అధికార యంత్రాంగం నివారణ చర్యలు చేపడుతోంది. ఈ వ్యాధి గురించి ఆశ కార్యకర్తలు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఒడిశాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ధాటికి ఇప్పటి వరకు ఏడుగురు వ్యక్తులు చనిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ఒడిశా హెల్త్ డిపార్ట్మెంట్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి అధ్యయనం చేసేందుకు వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (వీఐఎంఎస్ఏఆర్) నుంచి ముగ్గురు నిపుణులను బర్గఢ్ జిల్లాకు పంపించింది. ప్రస్తుతం బర్గఢ్ జిల్లాలో 11 మంది స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన వ్యక్తులు ఉన్నారు. వారిలో ఉన్న లక్షణాలు పరిశీలించి.. వారికి ఆ వ్యాధి ఎలా సోకింది.. దాని పర్యవసాలు ఏంటి అనేది ఈ నిపుణుల బృందం పర్యవేక్షించనుంది. ఇక పొలాలు, అటవీ ప్రాంతాల్లో పనిచేసే వారికి ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుందని తెలుస్తోంది. చెట్లలో ఉండే ఒక రకమైన లార్వా కుట్టడంతో శరీరంపై ఎస్చర్ అనే మచ్చ పడుతుందని అధికారులు చెబుతున్నారు. అవి కుట్టిన చోట చర్మకణాలు మృతి చెందుతాయని.. వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు.