కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ యువతిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను అల్లరి చేస్తూ వికృత చేష్టలు చేశారు. చివరికి ఆమె వేసుకున్న చున్నీని లాగారు. దీంతో ఆమె కిందపడిపోయింది. అంతలోనే ముందు, వెనక నుంచి రెండు బైక్లు వచ్చి ఢీకొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. తప్పించుకోవాలని చూశారు. వెంటనే వారిపై కాల్పులు జరిపి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు ఆ యువతి చున్నీని లాగిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని అంబేడ్కర్ నగర్లో చోటు చేసుకుంది. రోజూ లాగే హీరాపూర్ బజార్లో ఉన్న కాలేజ్కు వెళ్లిన వారాహి గ్రామానికి చెందిన 17 ఏళ్ల నైన్సీ పటేల్.. తిరిగి సాయంత్రం సైకిల్పై ఇంటికి బయల్దేరింది. తన స్నేహితురాలితో కలిసి చెరో సైకిల్ మీద రోడ్డుపై వెళ్తుండగా.. బైక్పై వెళ్తున్న యువకులు నైన్సీ పటేల్ను వేధించడం ప్రారంభించారు. అయితే అవేమీ పట్టించుకోకుండా నైన్సీ తన సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే బైక్పై వెళ్తున్న ఓ యువకుడు ఆమె వేసుకున్న చున్నీని లాగాడు. దీంతో ఆమె సైకిల్ అదుపు తప్పి నడి రోడ్డుపై పడింది. అప్పుడే వెనక నుంచి వచ్చిన ఒక బైక్, ముందు నుంచి వచ్చిన మరో బైక్ మధ్యలో నైన్సీ సైకిల్ ఇరుక్కుంది. రెండు బైక్లు వచ్చి ఒకేసారి ఢీకొట్టడంతో నైన్సీ పటేల్ తీవ్ర గాయాలపాలైంది.
వెంటనే స్పందించిన నైన్సీ ఫ్రెండ్ తన సైకిల్ వదిలేసి ఆమె దగ్గరకు వెళ్లింది. స్థానికుల సాయంతో నైన్సీని ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే తీవ్ర గాయాలతో చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో నైన్సీ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి వారి ఇంటికి ఆదివారం వెళ్లారు. అయితే తమను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారని పసిగట్టిన ముగ్గురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు.
ఇద్దరు సోదరులు షాబాజ్ అతని అన్న అర్బాజ్ పారిపోతుండగా.. పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో వారికి గాయాలు కావడంతో పరిగెత్తలేక పోలీసులకు దొరికిపోయారు. వీరితోపాటు మరో నిందితుడు మహ్మద్ ఫైసల్ కూడా కాలి గాయంతో పోలీసులకు లొంగిపోయాడు. వీరి ముగ్గురి వయసు దాదాపు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్ల తెలిపారు.