ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా,,,మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 10:41 PM

మోదీ ప్రభుత్వ వ్యతిరేక పక్షాలన్నీ జూన్‌ 12న భేటీ కావాలని నిర్ణయించాయి. బిహార్‌ రాజధాని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల పెద్ద సమావేశం జరుగనున్నది. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి 18కి పైగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే ఇది సన్నాహక సమావేశం మాత్రమే అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒక నేత తెలిపారు. విపక్షాల ప్రధాన సమావేశం ఆ తర్వాత జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది.


2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం నితీశ్ కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా పలు పార్టీల అధినేతలను ఇటీవల నితీశ్ కలుస్తున్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీతో ఇటీవల ఢిల్లీలో భేటీ అయ్యారు. మరోవైపు.. ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కలుసుకున్నారు. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ లతో మంతనాలు జరిపారు.


పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని ఇటీవల ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శించాయి. దీనికి నిరసనగా ఆదివారం నిర్వహించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఈ మేరకు 20 పార్టీలు ఉమ్మడి ప్రకటన కూడా విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక కదలిక వచ్చింది. దీంతో పాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం వాటికి మరింత బలాన్నిచ్చింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కూడా నితీశ్ కలిశారు.


ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై ఎన్నికైన కేజ్రీవాల్‌కే అన్ని అధికారాలు ఉంటాయని ఇటీవల సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చి.. ఢిల్లీలో ప్రభుత్వ అధికారులపై పెత్తనాన్ని చెలాయించేందుకు ప్రయత్నం చేసింది. దీనిని తీవ్రంగా ఖండించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ ఆర్డినెన్స్‌ను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభలో ఏ పార్టీకీ మెజారిటీ లేదు కనుక.. విపక్ష పార్టీలను ఐక్యం చేసి.. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించాలని చూస్తున్నారు. దీని కోసం అన్ని రాష్ట్రాలు తిరిగి వివిధ పార్టీల నేతలను ఒప్పించారు. ఈ సంఘటనలతో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం అవుతున్నట్లు కనిపిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com