ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ జాంలో చొచ్చుకొచ్చిన ట్రక్కు... ఆప్రమాదంలో పలువురికి గాయాలు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 09:54 PM

అది ఎక్స్‌ప్రెస్ హైవే. వాహనాలతో కిక్కిరిసి ఉంది. ఇంతలో ఓ ట్రక్కు వేగంగా వచ్చి ముందున్న వాహనాలను ఢీకొట్టింది. దీంతో 12 వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. వాటిలో కొన్ని వాహనాలు తుక్కుతుక్కు అయ్యాయి. ఇంత బీభత్సం జరిగినా.. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ముంబై - పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై మహారాష్ట్రలోని ఖోపోలి సమీపంలో గురువారం (ఏప్రిల్ 27) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వేగంగా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. బ్రేకులు ఫేయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని మరి కొంత మంది చెబుతున్నారు. ఆ ట్రక్కు ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ఆ కారు మరో కారును ఢీ కొంది. అలా మొత్తం 12 కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి.


ప్రమాదానికి కారణమైన ట్రక్కు మొదటి కారును ఢీకొట్టిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న ఓ స్టేషనరీ షాప్‌ను ఢీకొని ఆగిపోయింది. ఆ కారులోని నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ట్రక్కు నంబర్ ఆధారంగా యజమాని వివరాలు సేకరించారు. 6 లేన్ల ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 95 కి.మీ. 2002 నుంచి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com