ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో,,,కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన కోటంరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 06:21 PM

తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీలో గత కొద్దిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాలను హీట్ పుట్టిస్తోంది. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్లు గతంలో టీడీపీ ఆరోపించగా.. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని వ్యాఖ్యానించడం ఏపీ పాలిటిక్స్‌లో సెగలు రేపుతోంది.


ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి మరో స్టెప్ తీసుకున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం కోటంరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించిందని, దదీనిపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ రోజే కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపిస్తున్నానని, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.


'నేరుగా వెళ్లి అమిత్ షాను కలిసి ఫోన్ ట్యాపింగ్‌పై లేఖ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా. ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తే నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఆరోపణలు చేసినప్పుడు మీరు కూడా సరైన పద్దతితో మాట్లాడాలి. నాపై శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. నేను కేసులకు భయపడను.. కేసులు నాకు కొత్త కాదు. సొంత పార్టీ వాళ్లే నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను అవమానపరిచారు. జగన్ ఆదేశాలతోనే నా ఫోన్ ట్యాప్ చేశారు. నిజాలు బయటపెట్టిన నాపై వైసీపీ నేతలందరూ మూకుమ్మడిగా దాడి చేస్తూ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. నన్ను అరెస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపించినా నా గొంతు ప్రశ్నించడం ఆగదు' అని కోటంరెడ్డి తెలిపారు.


తన గొంతు ఆగాలంటే ఎన్ కౌంటర్ చేయండి అంటూ కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిని, నిజాలు మాట్లాడేవారిని అరెస్ట్ చేయించటం, అక్రమ కేసులు పెట్టటం అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రభుత్వానికి తనను అరెస్ట్ చేయటం ఏమంత పెద్ద విషయం కాదన్నారు. కాగా వైసీపీ నేతలు మాత్రం కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ చేయలేదని, అది రికార్డ్ చేసి ఆడియో అని చెబుతున్నారు. ఆయన ఫ్రెండ్ ద్వారా బయటకు లీక్ అయిందని చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com