ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దెందులూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే లండన్‌ నుంచి వచ్చా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:32 AM

దెందులూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే లండన్‌ నుంచి వచ్చానని.. నిజయోకవర్గానికి చెందిన యువతకు వేలాది ఉద్యోగాలు ఇప్పించానని వైసీపీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. అయినా చంద్రబాబు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తమ్మిలేరులో తాను ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ఆయన సవాల్‌ విసిరారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని విజయరాయిలో ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సంద్భంగా స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లండన్ నుంచి వచ్చిన అబ్బయ్యను తిరిగి అక్కడికే పంపిస్తానని వ్యాఖ్యానించారు. అయితే, చంద్రబాబు తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని అబ్బయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. 


దెందులూరులో రూ.1,700 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని.. ప్రగతి యాత్రలో అదే విషయాన్ని చెప్పామని అబ్బయ్య చౌదరి అన్నారు. అయినా, టీడీపీ హయాంలో చేసిన ఒక్క మంచిపని చెప్పాలని సవాల్‌ విసిరారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు.


ఓటమి భయంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని అబ్బయ్య చౌదరి ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాకు పాల్పడింది చింతమనేని కాదా? అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో వచ్చే ఫలితంతో చింతమనేని ప్రభాకర్‌ని కూడా చంద్రబాబు తన వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com