ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్న చైనా

international |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:20 AM

తమ దేశ ప్రజలు చేపట్టిన ఆందోళనలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. కరోనా కట్టడికి చైనా అనుసరిస్తోన్న జీరో కోవిడ్ విధానాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. తియానన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన తర్వాత చైనాలో జరుగుతున్న అతిపెద్ద నిరసనలు ఇవే కావడం గమనార్హం. అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన చాలా మంది నేతలు విద్యాభ్యాసం చేసిన ప్రఖ్యాత షింఘూవా యూనివర్సిటీలోనూ ఆందోళనకు దిగడం పరిస్థితికి అద్దంపడుతోంది. చైనా ప్రజలు తమ నిరసనలు తెలియజేయడానికి తెల్ల కాగితాలను ఎంచుకోవడంతో ‘తెల్లకాగితం ఆందోళనలు’ లేదా ‘ఏ4 విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా ఈ ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది.


చైనాలో భావప్రకటన స్వేచ్ఛకు అక్కడ పాలకులు ఏనాడో సంకెళ్లు వేశారు. సాధారణంగా ఎటువంటి ఆందోళనలనైనా మొగ్గదశలోనే అణచివేస్తారు. ఈ నేపథ్యంలో నేరుగా ప్రభుత్వాన్ని లేదా వ్యక్తులను కించపర్చకుండా ఆందోళనకు తెల్లకాగితాన్ని మార్గంగా ఎంపిక చేసుకున్నారు. దీంతోపాటు చైనాలోని సెన్సార్‌షిప్‌ను తెలియజేసేందుకు కూడా ఈ శ్వేతపత్రం గుర్తుగా ఉంటుంది. ఆందోళన సమయంలో ఎటువంటి నినాదాలు చేయకుండానే విషయం అందరికీ తెలిసేలా చేస్తుంది. షింఘువా విశ్వవిద్యాలయంలోనూ ఈ విధంగానే విద్యార్థులు నిరసన తెలిపారు. 2020లో హాంకాంగ్‌ ఆందోళనల్లో కూడా తెల్లకాగితాన్ని గుర్తుగా వినియోగించారు. ఇప్పుడు నేరుగా చైనాలోని ఆందోళనలకు వీటిని వాడటం అక్కడి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తోంది.


ఈ తెల్లకాగితం నిరసనలను సోషల్‌ మీడియాలో కనిపించకుండా ఉండేందుకు చైనా చేయని ప్రయత్నం లేదు. టిక్‌టాక్‌, విబో వంటివి సోషల్ మీడియా దిగ్గజాలు ఖాళీ తెల్లకాగితం ఫోటోలను తమ వేదికలపై నుంచి తొలగిస్తున్నాయి. ఈ ఉద్యమం ఎంతగా విస్తరించిందంటే... చైనాలో ఏ4 తెల్లకాగితాల విక్రయాన్ని నిలిపివేశారనే వదంతులు కూడా వ్యాపించాయి. ఫలితంగా అక్కడ ప్రముఖ స్టేషనరీ చైన్‌ స్టోర్ల సంస్థ ‘ఎం అండ్‌ జీ స్టేషనరీ’ షేర్లు 3.1శాతం పతనం అయ్యాయి. ఈ సంస్థకు చైనా వ్యాప్తంగా 80,000 దుకాణాలు ఉన్నాయి. ఈ కంపెనీ ఏ4 పేపర్లు విక్రయాన్ని నిలిపివేసిందనే వార్తలే దీనికి కారణం. చివరికి ఆ తప్పుడు వార్తలపై ఆ సంస్థ వివరణ ఇచ్చుకోవాల్సి పరిస్థితి తలెత్తింది.


నిరసనలు మిన్నంటుతుండటంతో విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లోని విద్యార్థులను చైనా అధికారులు ఇళ్లకు పంపివేస్తున్నాయి. ఆందోళనల కట్టడి దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్సిటీలు ఈ చర్యలకు ఉపక్రమించాయి. కొన్ని వర్సిటీలు బస్సులు ఏర్పాటుచేసి మరీ విద్యార్థులను రైల్వేస్టేషన్లకు తరలిస్తున్నాయి. తరగతులు, పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో బ్రిటన్‌, అమెరికా వంటి పలు దేశాల నుంచి పౌర ఆందోళనకు మద్దతు లభిస్తోన్న నేపథ్యంలో కొవిడ్‌ ఆంక్షలను స్వల్పంగా సడలిస్తామని చైనా తాజా ప్రకటన చేసింది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రాజీనామా కోరుతూ ఈ ఆందోళనలు రాజకీయ మలుపు తిరగడం కూడా ఈ వైఖరికి మరో కారణం. ప్రభుత్వం ‘జీరో కొవిడ్‌’ విధానం నుంచి వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని అధికార పత్రిక ‘పీపుల్స్‌ డైలీ’ స్పష్టం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com