ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ లవ్ స్టోరీలో ట్విస్ట్...భర్తకు ప్రియురాలితో పెళ్లి వ్యవహారంలో కీలక మలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:40 PM

కొన్ని సన్నివేశాలు...ఘటనలు సినిమాలో మాత్రమే సక్సెస్ అవుతాయి. నిజజీవితంలో అది సక్సెస్ కాదు. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఓ మహిళ తన భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిందనే వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఊహించని మలుపు తిరిగింది. భర్తకు ప్రియురాలు పెళ్లి చేసిందనే వాదనను ఇటీవల ఆ యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి నిత్య ఖండిస్తోంది. తనే అసలు భార్యనని చెబుతోంది. తన భర్త కళ్యాణ్ తనతోనే ఉండాలని కోరుతోంది. అత్తామామలు కూడా ఇదే కోరుకుంటున్నారని నిత్య తెలిపింది. పెళ్లి జరిగిన తర్వాత తన భర్త.. ఆమెతో (మొదటి భార్య) వెళ్లిపోయాడని, తనతో ఒక్క క్షణం కూడా లేడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముగ్గురూ కలిసి ఉండాలనే దానికి ససేమిరా ఒప్పుకోనని తేల్చి చెప్పింది. తనే అసలు భార్యనని.. పెద్దల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని తెలిపింది. తన భర్త మొదటి పెళ్లి చెల్లదని వాదిస్తోంది. ఆమెకు అంతకుముందే మరో వ్యక్తితో వివాహం జరిగిందని, ఓ బేబీ కూడా ఉందని చెబుతోంది. ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవవధువు నిత్య అనేక విషయాలను చెప్పుకొచ్చింది.


విశాఖకు చెందిన నిత్య డిగ్రీ వరకు చదివింది. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటోంది. టిక్ టాక్‌లో వీడియోలు చేసేదాన్నని.. కళ్యాణ్ కూడా వీడియోలు చేసేవాడని తెలిపింది. ఓసారి తన బర్త్ డే సందర్భంగా చేసిన టిక్ టాక్ వీడియోకు కళ్యాణ్ కామెంట్ పెట్టాడని.. నాటి నుంచి తమ మధ్య చాటింగ్ మొదలైందని చెప్పింది. అలా మొదలైన పరిచయం ఫోన్లు చేసుకొని మాట్లాడుకోవడం వరకూ వచ్చిందని వివరించింది. 3, 4 నెలలకు ఓసారి కలుసుకునేవాళ్లమని తెలిపింది. ఏడాదిన్నర తర్వాత కళ్యాణ్‌పై తనకు నమ్మకం రావడంతో తనే పెళ్లి ప్రపోజల్ చేశానని చెప్పింది.


తన చెల్లి పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసుకుందామని కళ్యాణ్ చెప్పాడని.. ఆ తర్వాత వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోరని కొంత కాలం తాత్సారం చేశాడని నిత్య తెలిపింది. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులతోనూ తనే మాట్లాడి ఒప్పించానని చెప్పుకొచ్చింది. మధ్యలో ఆ అమ్మాయి (మొదటి భార్య) ఎప్పుడు ఎంటర్ అయ్యిందో తెలియదని వాపోయింది. ‘నన్ను ఎందుకు మోసం చేశావ్ అని కళ్యాణ్‌ను నిలదీశాను. నాకు తెలియకుండా, అతడి తల్లిదండ్రులకు చెప్పకుండా.. ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. నేను అడిగిన ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం కూడా చెప్పలేదు. అలాగని అతడిపై నేను చీటింగ్ కేసు పెడితే.. నాకు దక్కడు. తన తల్లిదండ్రులకు కూడా దూరమవుతాడు. అందుకే ఆ పని చేయలేదు’ అని నిత్య చెప్పింది.


పెళ్లికి ముందు ముగ్గురూ కలిసి ఉండాలనే ప్రతిపాదనకు తాను ఒప్పుకున్నట్లు నిత్య తెలిపింది. అలా చేయడానికి తనకో కారణం ఉందని వివరించింది. ‘నేను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. పెళ్లి జరగడం కోసమే తన ప్రతిపాదనకు ఒప్పుకున్నా. కానీ, ఇప్పుడు చెబుతున్నా. ముగ్గురం కలిసి ఉండటానికి నేను ఒప్పుకోను. నా భర్త నాకు కావాలి. పెళ్లికి ముందే నేను ఇలా చెబితే.. ఈ పెళ్లి జరిగి ఉండేది కాదు. ఆయన మీద నాకు నమ్మకం పోయింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మధ్యలో ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడే ఆ నమ్మకం పోయింది. ఇప్పుడు ముగ్గురం కలిసి సంతోషంగా ఉందామని చెబితే నేను ఎలా నమ్మాలి?’ అని నిత్య ప్రశ్నించింది.


ఆమె మొదటి భార్య అనే విషయాన్ని తాను అస్సలు ఎంకరేజ్ చేయనని నిత్య తేల్చి చెప్పింది. భర్తకు ప్రియురాలు పెళ్లి చేసిందంటూ ఆమెను హైలైట్ చేయొద్దని, త్యాగమూర్తిలా చిత్రీకరించొద్దనీ మీడియాను కోరింది. 50 రోజులు ఒకరి వద్ద, 50 రోజులు మరొకరి వద్దా ఉండాలనే ప్రతిపాదన కొందరు బంధువులు తీసుకొస్తున్నారని, దానికి కూడా తాను ఒప్పుకునేది లేదని చెప్పింది. ప్రస్తుతం ఆమె తన అత్తామామలతోనే ఉంది. వాళ్లిద్దరూ ఉన్న ఇంటికి తాను వెళ్లనని తెగేసి చెప్పింది. తన భర్త తన ఇంటికి వచ్చి అక్కడే తనతో కాపురం చేయాలని కోరుతోంది. ‘పెళ్లి జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా నాతో లేడు. ఏమీ జరగలేదు. అయినా, శారీరకంగా కలిస్తేనే భార్యాభర్తలు కాదు కదా..! తను నాతో ఉంటే చాలు’ అంటోంది నిత్య.


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com