బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేసి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మహిళా నేతలు మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయకుంటే సమాజంలో మహిళలకు మరింత అవమానం జరిగే ప్రమాదం ఉందని పేర్కొనడం జరిగింది.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చీర కట్టుకొని, గాజులు తొడుక్కోవాలంటూ బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో అదే రోజు ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత, మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డికి ఒకటి చూపించాలనుకుంటున్నాం'' అంటూ చెప్పు తీసి చూపించారు. ''మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇంకోసారి అలా కించపరిచేలా మాట్లాడితే ఈ చెప్పుతోనే దెబ్బలు తినాల్సి వస్తుంది'' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు