పర్యాటకులకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గుడ్న్యూస్ చెప్పింది. హరిత హోటల్స్ అండ్ రిసార్ట్స్లో స్టే చేసేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. హోటల్స్లో రూంలు తీసుకునేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది అన్ని రోజుల్లోనూ వర్తించదు. సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. వీకెండ్ రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం ఛార్జీలు అలాగే ఉంటాయి. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని హరిత హోటళ్లలో పైలట్ ప్రాతిపదికన సెప్టెంబర్ నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యాటకుల నుంచి వచ్చే స్పందనను బట్టి తదనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న జరుపుకునే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ డిస్కౌంట్ ఆఫర్ తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం టీజీటీడీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 25 హరిత హోటళ్లు, రిసార్ట్లను నిర్వహిస్తోంది. వాటిలో ఎక్కువ భాగం ప్రసిద్ధ దేవాలయాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, ఆనకట్టలు, రిజర్వాయర్ల సమీపంలో ఈ హోటళ్లు అందుబాటులో ఉన్నాయి.
ఏనుగులను చంపి మాంసం పంచనున్న ప్రభుత్వం
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, యాత్రికులు ఈ సుప్రసిద్ధ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాలలో ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా పర్యాటక ప్రాంతాల్లో వారికి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గాను హరిత హోటళ్లు, రిసార్ట్లు ఏర్పాుట చేశారు. వీకెండ్లలో అంటే శుక్రవారం నుంచి ఆదివారం వరకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 80 శాతం నుండి 100 శాతం మధ్య ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మిగిలిన రోజుల్లో పర్యాటకుల ఆక్యుపెన్సీ దాదాపు 40 శాతానికి పడిపోతుంది.
ఈ క్రమంలో టూరిజంను ప్రోత్సహించేందుకు గాను ఆయా రోజుల్లో డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మరింత మంది టూరిస్టులను పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా.. హరిత హోటళ్లలో ఉండేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.