ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎగువన కురుస్తోన్న వర్షాలతో ఆల్మట్టికి భారీ వరద,,,నెలాఖరుకు నిండుకుండలా శ్రీశైలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 08:19 PM

కృష్ణా బేసిన్‌లో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర నుంచి నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం జలాశయం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రికి 2.27 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం.. శని, ఆదివారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాలతో ఆల్మట్టి జలాశయానికి ప్రవాహం పెరగడంతో శుక్రవారం సాయంత్రం నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు, తుంగభద్ర నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు.


 ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది. మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో ఆల్మట్టిలోకి వరద ప్రవాహం పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. దీంతో గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే బయటకు పంపుతున్నారు. ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్ధ్యం 129 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 85 టీఎంసీలు ఉంది. ఎగువ నుంచి 2.10 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 3 లక్షలు క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.


ఈ నీరు దిగువన ఉన్న నారాయణపూర్‌‌కు చేరుతుండగా.. అక్కడ కూడా గేట్లు ఎత్తేశారు. ఈ ప్రాజెక్ట్ సామర్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 31 టీఎంసీలకు చేరగా... 2.61 లక్షల ప్రవాహం.. వస్తుంటే 2.65 లక్షలు వదిలిపెడుతున్నారు. జూరాలకు 2.49 లక్షలు వస్తుంటే.. 1.91 లక్షల క్యూసెక్కులు నీరు దిగువకు వెళ్తోంది.


ఇక, శ్రీశైలం జలయాశం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 100 టీఎంసీలు దాటింది. వారం రోజుల్లోనే 80 టీఎంసీల వరద వచ్చి చేరింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువనకు 35,315 టీఎంసీలు దిగువ వదులుతున్నారు.


మరోవైపు, గోదావరిలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ 9.9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదుకాగా... భద్రాచలం వద్ద 10.11 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుంది. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి 25 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లిలోకి 23 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టు నిండటానికి నాలుగు టీఎంసీలే అవసరం కావడంతో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని ఎత్తిపోత ప్రారంభించే అవకాశం ఉంది.


అటు, భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 48.2 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంద్రావతి నుంచి వస్తోన్న వరద కారణంగా పెరిగినట్టు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. నీటిమట్టం పెరిగితే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com