మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మేకల పాకలో అతడిని కత్తులతో నరికి చంపారు. ఈ హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యే భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కూతురు ప్రేమకు అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నెక్కం చిన్న ఆంజనేయులు (42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది. కాలనీ సమీపంలోని తన మేకల పాకలో నిద్రిస్తున్న ఆంజనేయులును ఇవాళ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. ఆపై కారం చల్లి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి భార్యను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కూతురు ఓ అబ్బాయిని ప్రేమించగా.. పెళ్లికి ఆంజనేయులు ఒప్పుకోలేదు. దీంతో అతడి అడ్డు తొలగించేందుకు భార్యే దారుణానికి ఒడిగట్టింది. మూడు మేకల్ని సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు సమాచారం అందించింది. ఈ కేసులో భార్యతో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.