ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రిని కలిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. కేసీఆర్‌కు మరో షాక్ తప్పదా..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 07:36 PM

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నుంచి గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టగా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవంతో కీలక నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఉవ్లిళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవటం.. పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలోనే.. మరికొంత మంది బీఆర్ఎస్ కీలక నేతలు కూడా పార్టీ మారబోతున్నట్టుగా కాంగ్రెస్ నేతలు లీకులు ఇస్తున్న నేపథ్యంలో.. ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబును కలిసినట్టుగా వార్తలు రావటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్యెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి ఈరోజు (జూన్ 22న).. మంత్రి శ్రీధర్ బాబుని కలిసినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దోమల్‌గుడాలో మంత్రి శ్రీధర్ బాబు నివాసంలోనే జీవన్ రెడ్డి కలిసినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీకవటంతో.. ఆయన కూడా పార్టీ మారుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవన్ రెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.


 అయితే.. బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత.. పొరుగు రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు బాల్క సుమన్‌తో పాటు జీవన్ రెడ్డి చూసుకున్నారు. మహారాష్ట్రలో బహిరంగ సభల నిర్వాహణలో జీవన్ రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాకుండా.. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారటంపై కూడా ఘాటుగానే స్పందించారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక నిధులు ఆయనకే విడుదలయ్యాయని, ఎక్కువ ఇండ్లు ఆయన నియోజకవర్గానికి మంజూరు చేశారని తెలిపారు. కేసీఆర్ లక్ష్మీపుత్రుడని కితాబిస్తే లంక పుత్రుడుగా మారారంటూ విమర్శించారు. క్రషర్లు, ఇసుక దందాలు మూత పడటంతోనే కాంగ్రెస్‌లోకి పోచారం వెళ్లారంటూ జీవన్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు.


ఇదిలా ఉంటే.. ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి కుటుంబానికి చెందిన "జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ అండ్ మల్టిప్లెక్స్" భవనానికి సంబంధించి వివాదం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు గానూ విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ కంపెనీ.. బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) కింద 2013లో లీజ్‌కు తీసుకోగా.. అద్దెను సకాలంలో చెల్లించకపోవటంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో మాల్‌ను ఆర్టీసీ సంస్థ సీజ్ చేయటం.. ఆ తర్వాత అద్దె చెల్లించటం ఇలా జీవన్ రెడ్డి వార్తల్లో నిలిచారు. కాగా.. ఇప్పుడు మంత్రి శ్రీధర్ రెడ్డిని కలవటంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఆయన.. మంత్రిని కలిసింది ఎందుకన్నది క్లారిటీ రావాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com